19-07-2025 06:43:42 PM
కలెక్టర్ జితేష్ వి. పాటిల్..
కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారానికి వినూత్న ఆలోచనతో ప్రజలతో నేరుగా పరస్పర చర్య కోసం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్(District Collector Jitesh V. Patil) శనివారం ఉదయం 8:30 గంటల నుండి 9:30 గంటలకు ఆల్ ఇండియా రేడియో కొత్తగూడెం కేంద్రం ద్వారా అభివృద్ధి పథంలో భద్రాద్రి కొత్తగూడెం అనే ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజలకు లైవ్ ఫోన్ కాల్ల ద్వారా కలెక్టర్తో నేరుగా మాట్లాడే అవకాశాన్ని కల్పించడంతో, వివిధ మండలాల నుంచి ఎన్నో ప్రశ్నలు, అభిప్రాయాలు, సూచనలు తెలియజేశారు. ప్రజలు ఆరోగ్యం, విద్య, గ్రామీణ రహదారులు, తాగునీటి సమస్యలు, రేషన్ కార్డుల జారీ, పెన్షన్ జాప్యం, వ్యవసాయ సవాళ్లు, గిరిజన ప్రాంతాల అభివృద్ధి వంటి కీలక అంశాలను ప్రస్తావించారు.
జిల్లా కలెక్టర్ ప్రతి అంశాన్ని ఆసక్తిగా వినడంతో పాటు, సమస్యలపై తక్షణ స్పందన ఇచ్చారు. కొన్ని సమస్యల పరిష్కారానికి సంబంధించి సంబంధిత శాఖలకు తక్షణం సూచనలు జారీ చేయనున్నట్లు తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.... ప్రతి ఒక్కరి అభిప్రాయం ఎంతో విలువైనది. ప్రజల అభ్యర్థనలు, సమస్యలు పాలనకు మార్గదర్శకంగా పనిచేస్తాయన్నారు. ప్రజలతో నేరుగా మాట్లాడే ఈ తరహా కార్యక్రమాలను తరచూ నిర్వహిస్తూ జిల్లా అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందిస్తాం అని తెలిపారు. అలాగే, వ్యవసాయం వ్యర్థం కాదని, అది జీవనాధారం అని కలెక్టర్ స్పష్టం చేశారు.
యువత అందరూ ఉద్యోగాల కోసం నిరీక్షించకుండా ఉన్న భూములను సద్వినియోగం చేసుకుంటూ ఆయిల్ ఫామ్, మునగ సాగు, చేపల పెంపకం వంటి ఆధునిక వ్యవసాయ మోడళ్ల ద్వారా యువత ఆర్థికంగా ఎదగాలన్నారు. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు పాటిస్తూ అధిక దిగుబడులు సాధించాలన్నారు. జిల్లాలో ఇప్పటికే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలియజేస్తూ, ప్రతి పౌరుడు జిల్లా అభివృద్ధిలో భాగస్వామ్యుడిగా ముందుకురావాలి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ హెడ్ కోలిపాక శంకర్ రావు,సిబ్బంది ప్రభాకర్, ఆనంద్,సుమన్,కోటేశ్వర రావు, కట్ట రామకృష్ణ,శ్రీనివాస్, మహిళా రేడియో జాకీ లు పాల్గొన్నారు.