24 May, 2026 | 3:06 PM

Breaking News

బీజేపీ గెలుపు దేశ నినాదం

19-04-2024 12:45 AM

రోడ్‌షోలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, గోవా సీఎం ప్రమోద్ సావంత్

l తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కనుమరుగు ఖాయం

l కాంగ్రెస్‌కు ఓట్లు అడిగే హక్కు లేదు

l కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

మెదక్, ఏప్రిల్ 18(విజయక్రాంతి):  రానున్న రోజుల్లో తెలంగాణలో ఇంకో పార్టీకి భవిష్యత్తు లేదని, కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే కొనసా గుతుందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. గురువారం రాత్రి మెదక్ పట్టణంలోని రాందాస్ చౌరస్తాలో  నిర్వహించిన రోడ్‌షోలో ఆయన ప్రసంగించారు. ఆరు గ్యారంటీల పేరుతో రాష్ట్రం లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలను నిలువునా మోసం చేసిందని విమర్శించారు. పదేళ్లు పాలించిన బీఆర్‌ఎస్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత కనుమరుగవుతుందని, అలాగే కాంగ్రె స్ కనుమరుగు కావడానికి ఎంతో దూరం లేదని తెలిపారు.

ఫిర్ ఏక్ బార్ మోదీ అనే నినాదం దేశంలోని ప్రతి ఇంటిలో మారుమోగుతుందన్నారు. ప్రధానిగా మోదీ మూడోసారి కావడం ఖాయమన్నారు. ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావును గెలిపించి మోదీకి బహుమతిగా ఇవ్వాలన్నారు. గోవా సీఎం ప్రమోద్ సావంత్ మాట్లాడుతూ తెలంగాణలో పదేళ్లు కేసీఆర్ లూటీ చేస్తే.. ఇప్పుడు కాంగ్రెస్‌కు ఏటీఎంగా మారిందన్నారు. దేశ వ్యాప్తంగా జాతీయ రహదారుల నిర్మాణంలో భాగంగా తెలంగాణకు ఎన్నో రహదారుల అభివృద్ధి ప్రధాని మోదీ చేశారని, మోసాలు, కుట్రలు, అవినీతి, అక్రమాలు చేసే వారిని ఎన్నికల్లో నిలబెట్టారని, వారిని ఇంటికి పంపించి బీజేపీ అభ్యర్థిని పార్లమెంట్‌కు పంపించాలన్నారు.

ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు మాట్లాడుతూ రామరాజ్యం కావాలంటే బీజేపీకి ఓటు వేయాలన్నారు. పార్లమెంట్‌లో జిల్లావాసి వెళ్లాలి కాని అరువు తెచ్చుకున్నోళ్లు కాదన్నారు. బీఆర్‌ఎస్‌లో అభ్యర్థులు లేక అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారికి టికెట్టు ఇచ్చారని విమర్శించారు. జిల్లా మరింత అభివృద్ధి చెందాలంటే బీజేపీకి ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంఆర్‌పీఎస్ నాయకులు శ్రీనివాస్, మెదక్, సంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, గోదావరి అంజిరెడ్డి పాల్గొన్నారు.