19-07-2025 10:43:15 PM
109 మందికి తిరిగి మొబైల్ లను అందజేసిన జిల్లా ఎస్పీ..
అదిలాబాద్ (విజయక్రాంతి): మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులు వెంటనే సీఈఐఆర్ పోర్టల్ లో ఫిర్యాదు చేయాలని లేదా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలని ఎస్పీ అఖిల్ మహాజన్(SP Akhil Mahajan) సూచించారు. జిల్లాలో ఇటివల మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్న 109 మందికి తిరిగి వారి ఫోన్లను అందించారు. ఈ మేరకు శనివారం స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ పాల్గొని బాధితులకు ఫోన్లను అందించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. బాధితులు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను తిరిగి సంపాదించడం కోసం ప్రత్యేకంగా రికవరీ బృందాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. గత 20 రోజుల వ్యవధిలో వివిధ రాష్ట్రాలు, జిల్లాల నుండి బాధితులు పోగొట్టుకున్న, దొంగలించబడిన 109 మొబైల్ ఫోన్ లను తిరిగి రాబట్టినట్లు పేర్కొన్నారు. ఇకపై సెల్ ఫోన్ కు సంబంధించిన పత్రాలు, బాక్సులు లేకుండా దుకాణాదారులు వాటిని ఖరీదు చేస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు 900 మొబైల్ ఫోన్లను బాధితులకు తిరిగి అందించామని, ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ జీవన్ రెడ్డి, ఏఆర్ డిఎస్పీ ఇంద్రవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.