13-02-2025 12:00:00 AM
కడ్తాల్, ఫిబ్రవరి 12 ( విజయ క్రాంతి ) : కడ్తాల్ పట్టణ కేంద్రంలో వెలసిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవములు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ పాలాది ఆంజనేయులు ,మాజీ సర్పంచ్ గూడూరు లక్ష్మీ నర్సింహ్మ రెడ్డి తెలిపారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారంతో ఐదవ రోజుకు చేరుకున్నాయి.
దేవాలయంలో ప్రముఖ ఉపాసకులు జ్ఞాన ప్రసూనాంబ గారి ఆధ్వర్యంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని విష్ణు సహస్రనామ పారాయణం, లలితా సహస్రనామం, అమ్మవారికి ఒడిబియ్యం మరియు కుంకుమార్చనతో సహస్ర పారాయణం మొదలగు కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలను శాలువాలతో సత్కరించి, ప్రత్యేక కుంకుమార్చన భరణిలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ రామకృష్ణ,గ్రామ పెద్దలు గూడూరు సాయి రెడ్డి, గూద రాములు, బ్రహ్మచారి, గూడూరు జంగారెడ్డి, బాచిరెడ్డి అశోక్ రెడ్డి, అమృతం పాండు ఆలయ అర్చకులు తిరునగిరి శ్రీధర్ పంతులు తదితరులు పాల్గొన్నారు.