19-07-2025 08:26:11 PM
చొక్కారావు చిత్రపటానికి నివాళులు అర్పించిన కాంగ్రెస్ నేతలు
దీర్ఘకాలిక రాజకీయ మార్గదర్శి చొక్కా రావు
జిల్లా రాజకీయాలలో చొక్కా రావు పేరు చిరస్మరణయం - రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
కరీంనగర్,(విజయక్రాంతి): మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ మంత్రి దివంగత జువ్వడి చొక్కా రావు గారి 102 వ,జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు ఆరేపల్లి మోహన్ ,జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి హాజరై చొక్కా రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ చొక్కా రావు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు పోరాడి తెలంగాణ బోర్డు సాధించడానికి ముఖ్యపాత్ర పోషించినారని కరీంనగర్ పార్లమెంటు సభ్యుడుగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినారని నీతి నిజాయితీకి మారుపేరు చొక్కారావు అని, అత్యంత కీలకమైన పదవులలో ఉండి కూడా సాధారణ వ్యక్తి లాగా ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేసేవారని, చొక్కారావు అడుగుజాడల్లో కాంగ్రెస్ కార్యకర్తలు నడవాలని అన్నారు.
చొక్కా రావు విగ్రహానికి నివాళులు అర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్..
మాజీ మంత్రి చొక్కారావు జయంతి సందర్భంగా నగరంలోని వన్ టౌన్ కూడలి వద్ద గల చొక్కా రావు విగ్రహం వద్ద అర్బన్ బ్యాంకు చైర్మన్ గడ్డం విలాస్ రెడ్డి ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, పిసిసి కార్యదర్శి వైద్యులు అంజన్ కుమార్, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, జిల్లా ఆర్టిఏ మెంబర్ పడాల రాహుల్ తదితరులతో కలిసి చొక్కా రావు విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.
ఈ సందర్భంగా వారితో ఉన్న స్మృతులను గుర్తుకు చేసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ... ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో చొక్కారావు చిరస్మరణీయం అన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ గా రాజకీయాల్లో ఆదర్శంగా తీసుకోవాల్సిన నేత అనినీతికి నిజాయితీకి మారుపేరు గా చొక్కరావు జిల్లా రాజకీయాల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి అన్నారు. చొక్కా రావు 1957 ప్రాంతంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. నేను వారి శిష్యుడిగా రాజకీయాల్లో ఇప్పుడు రవాణా శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నాను అన్నారు. ఎల్ఎండిలో ఉన్న రవాణా శాఖ కార్యాలయంలో అక్కడ ఉన్న ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ కి వారి పేరు పెట్టుకోవడం జరిగిందని అన్నారు.