20-07-2025 01:00:38 AM
మొగుళ్లపల్లిలో రైతుల అవస్థలు
మొగుళ్లపల్లి (చిట్యాల), జూలై 19: పంటలకు కావలసిన యూరియా కోసం రైతులు తిప్పలు పడాల్సి వస్తున్నది. శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలోనీ ప్రాథమిక సహకారం సొసైటీ కేంద్రం వద్ద యూరియా పంపిణీ చేస్తుండటంతో అక్కడికి పెద్ద ఎత్తున రైతులు చేరుకున్నారు. యూరియా కోసం క్యూ కట్టారు. తీవ్రమైన ఉక్కపోత, ఎండ మూలం గా రైతులు క్యూలో నిల్చోలేక చెప్పులను క్యూలో పెట్టారు.
సీజన్ ప్రారంభమై నెలరోజులు గడుస్తున్నప్పటికీ యూరియా అందు బాటులో లేకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. సహకార సంఘాల ద్వారా యూరియా పంపిణీ జరుగుతున్నప్పటికీ డిమాండ్ మేరకు సప్లై లేకపోవడంతో సొసైటీల వద్ద పడిగాపులు పడుతున్నారు.