19-07-2025 08:37:00 PM
టాస్క్ఫోర్స్ పోలీసుల కొరడా..
హుస్నాబాద్: సిద్దిపేట టాస్క్ఫోర్స్ పోలీసులు, కోహెడ పోలీసులతో కలిసి అక్రమంగా డంప్ చేసిన ఇసుకను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 70 టన్నుల ఇసుకను సీజ్ చేసి, నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కోహెడ మండలం శంకర్ నగర్ గ్రామ శివారులో ఎస్ఎస్ బీ బ్రిక్స్ యజమాని గాజె సత్యనారాయణ ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను డంప్ చేసి అధిక ధరకు విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సిద్దిపేట టాస్క్ఫోర్స్ పోలీసుల(Task Force Police)కు సమాచారం అందింది. ఈ సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ పోలీసులు కోహెడ పోలీసులతో కలిసి శనివారం దాడులు నిర్వహించారు. ఇసుక డంప్ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనపై కోహెడ ఎస్ఐ అభిలాష్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా టాస్క్ఫోర్స్ అధికారులు అక్రమ కార్యకలాపాలకు పాల్పడేవారికి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుక, పీడీఎస్ బియ్యం, మొరం, మట్టి వంటి వాటిని అక్రమంగా రవాణా చేసినా, నిల్వ చేసినా, పేకాట, జూదం, గంజాయి ఇతర మత్తు పదార్థాల విక్రయం వంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమ కార్యకలాపాల గురించి సమాచారం తెలిస్తే వెంటనే సిద్దిపేట టాస్క్ఫోర్స్ అధికారుల ఫోన్ నంబర్లు 8712667445, 8712667447, 8712667446 కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.