సెప్టెంబర్ 26 నుంచి 28 వరకు 50 గంటల పాటు ప్రజా కళా జాతర
- పాటా–ఆటా–మాటలతో సాగనున్న సాంస్కృతిక కార్యక్రమం
- మండల కేంద్రంలో ఆహ్వాన కార్యక్రమం
గుండాల, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): అరుణోదయ సాంస్కృతికోద్యమంలో (Arunodaya Cultural Movement) ఐదు దశాబ్దాలుగా కొనసాగుతున్న విమలక్క ప్రజా కళా ప్రస్థానాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లో 50 గంటల పాటు “ప్రజా కళా జాతర” (praja kala jatara) నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సెప్టెంబర్ 26 నుంచి 28 వ తేదీ వరకు బాగ్ లింగంపల్లిలోని ఆర్టీసీ కళ్యాణ మండపం (అరుణోదయ నాగన్న ప్రాంగణం)లో ఈ కార్యక్రమం కొనసాగుతుందని వారు తెలిపారు.
ఈ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన కార్యక్రమాన్ని మండల కేంద్రంలో మోకాళ్ల సమ్మయ్య అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమంలో గుండాల సర్పంచ్ సీతారాములు తదితరులు ప్రసంగించారు. విమలక్క ఐదు దశాబ్దాలుగా ప్రజా సాంస్కృతిక ఉద్యమంలో భాగంగా పలు పాటలు, కళారూపాలను ప్రజల్లోకి తీసుకెళ్లారని తెలిపారు. విప్లవ గేయాలు, సామాజిక ఉద్యమ పాటలు, కుల హక్కుల గీతాలు, పర్యావరణ పాటలు, అమరుల స్మృతి గీతాలు, స్త్రీ విముక్తి గీతాలు, ఆదివాసీ స్వయం పాలనా పాటలు తదితరాలను ప్రజా కళారూపాలతో మేళవించి ప్రదర్శించినట్లు పేర్కొన్నారు.
ప్రజా కళా జాతరలో బుర్రకథ, ఒగ్గుకథ, భూమి బాగోతం, బతుకమ్మ, కోయ–గోండు నృత్యాలు, డప్పు నృత్యాలు, బ్యాలే, నృత్య నాటికలు తదితర కళారూపాలను ప్రదర్శించనున్నట్లు తెలిపారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజా, జానపద కళాకారులకు కూడా ఈ వేదికలో అవకాశం కల్పించనున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమం కేవలం 50 పాటల ప్రదర్శనకే పరిమితం కాదని నిర్వాహకులు తెలిపారు. సుమారు 50 మంది ఉపన్యాసకుల విశ్లేషణలు, వివిధ రంగాలకు చెందిన వారి అనుభవాలు, ప్రజా కళాకారుల ప్రదర్శనలు కలగలిపిన సాంస్కృతిక జాతరగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అంతరించే దశలో ఉన్న జానపద కళారూపాలను గుర్తించి వాటికి వేదిక కల్పించడమే కార్యక్రమ ఉద్దేశమన్నారు.
1974లో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఏర్పడిన సమయంలోనే విమలక్క బాల గాయనిగా ప్రజా వేదికలపై పాటలు పాడేవారని నిర్వాహకులు తెలిపారు. బాల్యం నుంచే జానపద కళలు, పాటలు, బతుకమ్మ, ఒగ్గుకథ తదితర కళారూపాలతో ఆమెకు అనుబంధం ఏర్పడిందన్నారు. అనంతరం అరుణోదయ సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ ప్రజా కళా ఉద్యమంలో తనదైన ముద్ర వేసినట్లు పేర్కొన్నారు.
కార్యక్రమంలో పాటలు, కళారూపాలు ప్రదర్శించదలచిన వారు ముందుగా నిర్వాహకులతో నమోదు చేసుకుని సమన్వయం చేసుకోవాలని సూచించారు. 50 గంటల పాటు జరిగే ప్రజా కళాజాతరను విజయవంతం చేసేందుకు సంస్థలు, కళాకారులు, ప్రజలు ఆర్థికంగా, హార్దికంగా సహకరించాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఆదివాసీల నాయకులు కోడెం వెంకటేశ్వర్లు, వీసీ దొర, రమణబాబు, న్యూడెమోక్రసీ నాయకులు గడ్డం లాలయ్య, ఈసం కృష్ణన్న, లాలు, పెంటన్న, అరెం నరేష్, పాయం ఎల్లన్న, సూర్యనారాయణ, సీపీఎం నాయకులు ఊకె వెంకటేశ్వర్లు, గ్రామస్థులు దడిగల రమేష్ తదితరులు పాల్గొన్నారు.