మచ్చుపేటలో ఘనంగా అక్షరాభ్యాస కార్యక్రమం
పోషణ మాసం సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అక్షరాభ్యాసం
ముత్తారం, సెప్టెంబర్ 18(విజయక్రాంతి): పోషణ మాసం (poshana maasam)సందర్భంగా పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం మచ్చుపేట గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో (Anganwadi Centre) చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని (Literacy program)ఘనంగా నిర్వహించారు. చిన్నారుల్లో విద్యపై ఆసక్తిని పెంపొందించడంతో పాటు, ఆరోగ్యం, పోషణ, పరిశుభ్రత, సమగ్ర అభివృద్ధిపై అవగాహన కల్పించడమే కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ చిలువేరి జ్యోతి లక్ష్మణ్, ఉపసర్పంచ్ దొంతుల రాకేష్ ముఖ్య అతిథులుగా హాజరై చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చిన్నారుల ఉజ్వల భవిష్యత్తుకు విద్య ఎంతో కీలకమని, అంగన్వాడీ కేంద్రాల ద్వారా బాల్యంలోనే విద్యాభ్యాసానికి బలమైన పునాది వేయడం అభినందనీయమన్నారు.
పోషణ మాసంలో భాగంగా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం, ఆరోగ్యం, పరిశుభ్రత తదితర అంశాలపై అవగాహన కల్పించారు. విద్యతో పాటు చిన్నారులకు సమతుల్యమైన పోషకాహారం అందించడం ద్వారా వారి శారీరక, మానసిక ఎదుగుదలకు దోహదపడుతుందని సూచించారు.
ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ కళావతి, ఏఎన్ఎం పుష్పలత, ఏఎల్ఎస్ఎంసీ కమిటీ సభ్యురాలు బాణాల కవిత, అంగన్వాడీ ఆయా మల్లమ్మ, గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు పాల్గొన్నారు.