పెద్దపహాడ్ యాదవుల భూమి అక్రమ రిజిస్ట్రేషన్
అఖిల భారత యాదవ మహాసభ తీవ్ర ఖండన
జనగామ,(విజయక్రాంతి): జనగామ జిల్లా పెద్దపహాడ్ గ్రామానికి చెందిన శ్రీ మల్లికార్జున గొర్రెల పెంపకందారుల సంఘానికి(Sri Mallikarjuna Sheep Breeders' Association) చెందిన 4.04 ఎకరాల భూమి (స.నెం. 582/F, 583/G/5) ను ఉస్మానియా ఆగ్రో ఇండస్ట్రీస్(Osmania Agro Industries) నకిలీ సంతకాలతో అక్రమంగా రిజిస్ట్రేషన్ (డాక్యు. నెం. 11/2007) చేసుకుందని 130 మంది సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. 2005లో తమ సంఘం పేరున ఉన్న భూమిని కబ్జా చేసి బెదిరిస్తున్నారని, కలెక్టర్, ఎమ్మార్వో లకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని వాపోయారు. విషయం తెలుసుకున్న అఖిల భారత యాదవ మహాసభ జిల్లా కమిటీ, మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ ఆధ్వర్యంలో వివాదాస్పద భూమిని సందర్శించి బాధితులకు సంఘీభావం తెలిపారు. అక్రమ రిజిస్ట్రేషన్ పై విచారణ జరిపి భూమిని ఇప్పించాలని, లేకుంటే జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు.