హాస్పిటల్లోకి చేరుతున్న క్యూరింగ్ వాటర్
- జారిపడి పలువురికి గాయాలు
- ఈ నీటిని మేము తోడలేమంటున్నా వర్కర్లు
కాగజ్ నగర్,(విజయక్రాంతి): కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా రోగులకు, వైద్య సిబ్బందికి ఇబ్బందులు తప్పడం లేదు. వివరాల్లోకి వెళ్తే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా(Komaram Bheem Asifabad District) కాగజ్ నగర్ పట్టణంలో సుమారు రు. 26 కోట్ల వ్యయంతో ప్రభుత్వం 100 పడకల ఏరియా ఆసుపత్రి నిర్మాణ పనులు చేపడుతుంది. సంబంధిత కాంట్రాక్టర్ గత 6 నెలలుగా పనులు చేస్తున్నాడు. హాస్పిటల్ నిర్మాణ పనులు(Hospital construction works) బాగానే జరుగుతున్నాయని, పేషంట్లలోను, సిబ్బందిలోను ఆనందం వ్యక్తం అవుతుంది. ఆస్పత్రి మొదటి, రెండవ అంతస్తుల్లో సిమెంట్ పనులు జరుగుతున్నాయి. ఇందుకోసం వాటర్ క్యూరింగ్ ను చేస్తున్నారు.
కానీపై అంతస్తులో వాటర్ క్యూరింగ్ సందర్భంగా అట్టి నీరు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న హాస్పిటల్ లోకి చేరుతుంది. హాస్పిటల్కు ప్రతిరోజు సుమారు 500 మంది పేషెంట్లు వచ్చి చికిత్సలు పొందుతున్నట్లు ఆసుపత్రి వర్గాలు పేర్కొంటున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ వాటర్ డాక్టర్ ఓపి చాంబర్ ముందు నీరు నిలవడంతో వర్కర్లు ఆ నీటిని తీసివేయడంలో ఇబ్బంది పడుతున్నారు. అలాగే చికిత్స కోసం వచ్చిన పలువురు పేషెంట్లు ఫ్లోర్ నీటితో తడిగా ఉండడంతో జారిపడి, గాయాల పాలైనట్లు పలువురు పేర్కొంటున్నారు. గత కొన్ని రోజులుగా ఈ విధంగా క్యూరింగ్ వాటర్ డాక్టర్ చాంబర్ బయట వెయిటింగ్ హాల్లో నీరు నిలవడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు.
ఇదే సమయంలో తాము ఇక వాటర్ క్యూరింగ్ ద్వారా పడుతున్న నీటిని తొలగించలేమని మహిళా సిబ్బంది వర్కర్లు హాస్పిటల్ సిబ్బందితో మొరపెట్టుకుంటున్నారు. ఈ విషయమై హాస్పిటల్లో నిర్మాణ పనులు చేయిస్తున్న సూపర్వైజర్ రామచందర్ ను వివరణ కోరగా.. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా.. ఈ హాస్పిటల్ నిర్మాణ పనులు చాలా వేగంగా జరిపిస్తున్నట్లు తెలిపారు. తమ కాంట్రాక్టర్కు ఇప్పటివరకు ఎలాంటి బిల్లులు రాకపోయినప్పటికీ పనులు జరిపించడం గొప్ప విషయమని కితాబిచ్చుకున్నారు. ఈ విషయంలో సంబంధిత శాఖ ఉన్నతాధికారులు స్పందించి ఇబ్బందులు తొలగిపోయేలా.. చర్యలు చేపట్టాలని పేషెంట్లు, హాస్పిటల్ సిబ్బంది కోరుతున్నారు.