పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు.. ఇరాన్లో 'Code 100' యాక్టివేట్
20-09-2026 | 08:37am
- సౌదీ, ఎయిర్ పోర్టులపై హౌతీల దాడులు
- అత్యవసరంగా వైట్ హౌస్ కు ట్రంప్
- ఇజ్రాయెల్ నెతన్యాహు తిరుగు పయనం
- పౌరులకు అమెరికా విదేశాంగశాఖ హెచ్చరిక
- సౌదీలోని తమ పౌరులను అప్రమత్తం చేసిన ఇటలీ
వాషింగ్టన్: పశ్చిమాసియాలో మరోసారి యుద్ధమేఘాలు అలుముకున్నాయి. దీంతో ఇరాన్ లో 'కోడ్ 100' అత్యవసర అలెర్ట్ జారీ చేశారు. ఇరాన్ సాయుధ బలగాలకు కీలక ఆదేశాలు జారీ చేయబడ్డాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) క్యాంప్ డేవిడ్ పర్యటన రద్దు చేసుకుని అత్యవసరంగా వైట్ హౌస్(White House)కు చేరుకున్నారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతాన్యహు(Benjamin Netanyahu) అమెరికా పర్యటన మధ్యలోనే ముగించుకుని ఇజ్రాయెల్ తిరుగు పయనం అయ్యారు.
విదేశాల్లోని పౌరులకు అమెరికా విదేశాంగశాఖ హెచ్చరిక జారీ చేసింది. సౌదీఅరేబియా, ఎయిర్ పోర్టులు లక్ష్యంగా హౌతీలు దాడులు(Houthi attacks) చేస్తున్నారని సూచించింది. విమానాల రద్దు, వైమానిక మార్గాల మూసివేతకు అవకాశముందని తెలిపింది. అమెరికా రాయబార కార్యాలయాలపైనా దాడులు జరిగే అవకాశముందని అనుమానాలు వ్యక్తం అవుతున్నారు. దీంతో విదేశాల్లోని అమెరికన్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సౌదీలోని తమ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇటీలీ సూచించింది. రియాద్లోని ప్రధాన విమానాశ్రయం సమీపంలో మంటలు, భారీ నల్లటి పొగ కనిపించిన కొద్ది గంటలకే, సౌదీ అరేబియా రాజధాని రియాద్లోని సున్నితమైన ప్రాంతాలు, ఎర్ర సముద్ర తీర నగరమైన యాన్బులోని ఆరామ్కో కేంద్రంపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేశామని యెమెన్కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించడంతో కలకలం రేగింది.
ఫిబ్రవరి నెలాఖరులో ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో ప్రారంభమైన విస్తృత మధ్యప్రాచ్య యుద్ధంలో తాజా దాడులు మళ్లీ మొదలైంది. దీనికి తోడు, హౌతీ-సౌదీ సంఘర్షణ ఇప్పటికే అస్థిరంగా ఉన్న ప్రాంతీయ భద్రతా పరిస్థితికి మరింత ఒత్తిడి పెంచింది. శనివారం తెల్లవారుజామున రియాద్ వైపు ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణిని తమ వాయు రక్షణ వ్యవస్థలు అడ్డుకుని ధ్వంసం చేశాయని సౌదీ అరేబియా సైనిక కూటమి ప్రకటించింది. సౌదీ అధికారులు రాత్రిపూట నివాసితులను సంభావ్య వైమానిక దాడి గురించి హెచ్చరిస్తూ అలర్ట్లు జారీ చేశారు.