Breaking News

ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు

09-09-2026 | 04:24pm

అదిలాబాద్, (విజయక్రాంతి) : ప్రజాకవి కాళోజీ నారాయణరావు(Kaloji Narayana Rao) జయంతి వేడుకలు బుధవారం పెన్ గంగా భవన్ లోని అదనపు కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ జయంతి వేడుకలలో భాగంగా అదనపు కలెక్టర్ ఆర్.ఎస్.చిత్రు, అధికారులు కాళోజీ నారాయణరావు చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ సాధారణ ప్రజానీకానికి అర్థమయ్యేలా తెలంగాణ యాసలో ఎన్నో కవితలు రచించి, ప్రజలను చైతన్యపరిచిన గొప్ప వ్యక్తి కాళోజీ అని కొనియాడారు. కాళోజీ సేవలకు కేంద్ర ప్రభుత్వం 1992లో పద్మ విభూషణ్ అవార్డు ఇచ్చి సత్కరించిందని చెప్పారు.

ఆయన పుట్టిన రోజును తెలంగాణ భాష దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. కాళోజీ లాంటి గొప్ప వ్యక్తుల జయంతులను ఈ విధంగా అధికారికంగా నిర్వహించుకోవడం ఎంతో గర్వించదగ్గ విషయమని అన్నారు. మహనీయుల జయంతి ఉత్సవాల అధికారికంగా నిర్వహించడం ద్వారా భావితరాల వారికి వారి గొప్పతనాన్ని తెలియజెప్పిన వారమవుతామని తెలిపారు. ఈ జయంతి వేడుకల్లో డిఆర్ఓ స్రవంతి, ఏవో వర్ణ, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు