పంట నాణ్యత, నిల్వ, ప్రాసెసింగ్పై దృష్టి
మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా పంటలు సాగు చేయాలి: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్
బిజినేపల్లి, సెప్టెంబర్ 19: రైతులు పంటల ఉత్పత్తితో పాటు నాణ్యత, నిల్వ, ప్రాసెసింగ్, మార్కెటింగ్పై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ (District Collector Hemant Keshav Patil) సూచించారు. శనివారం నాగర్ కర్నూల్ జిల్లా పాలెం గ్రామంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం, కేవీకే, వ్యవసాయ శాఖ, ఆత్మ ఆధ్వర్యంలో నిర్వహించిన కిసాన్ మేళాను రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు ఏవీఎన్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయడంతో పాటు రైతు సమూహాలుగా ఏర్పడి ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకోవాలని, విలువ ఆధారిత ఉత్పత్తుల ద్వారా అదనపు ఆదాయం పొందాలని కలెక్టర్ సూచించారు.
శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారుల సాంకేతిక సలహాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతులు పంటల సాగుకు ముందే అవగాహన పెంచుకుని పంటల మార్పిడి విధానాన్ని పాటించాలని రైతు కమిషన్ సభ్యులు ఏవీఎన్ రెడ్డి సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక శాఖల అధికారులు, శాస్త్రవేత్తలు, రైతులు పాల్గొన్నారు.