కొత్త సాంకేతిక పరిజ్ఞా నాన్ని అలవర్చుకోవాలి
జర్నలిస్టుల సంక్షేమానికి కృషి
త్వరలో జిల్లాలో జర్నలిస్టులకు శిక్షణ తరగతులు
ఏఐ టెక్నాలజీ శిక్షణ ఇస్తాం
టి డబ్ల్యూ జె(ఐజేయు) రాష్ట్ర అధ్యక్షుడు వీరహత్ అలీ
కామారెడ్డి, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): మారుతున్న కాలానికి అనుగుణంగా జర్నలి స్టులు నూతన సాంకేతిక విజ్ఞానాన్ని అలవర్చుకోవాలని టి యు డబ్ల్యూ జె (IJU) రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ కోరారు. జర్నలిస్టుల సంక్షేమం, వృత్తిపరమైన అభివృద్ధికి తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ, IJU) నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. బుధవారం ఆదిలాబాద్ మహా సభకు వెళ్తున్న మార్గ మాధ్యమంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో మాట్లాడారు. జిల్లా నేతలు ఆయన్ని ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...మారుతున్న కాలానికి అనుగుణంగా జర్నలిస్టులు కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని పుణికిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. త్వరలోనే జిల్లాలో జర్నలిస్టులకు ప్రత్యేకంగా శిక్షణ తరగతులు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ముఖ్యంగా ప్రస్తుత డిజిటల్ యుగంలో ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీపై జర్నలిస్టులకు సమగ్ర శిక్షణ ఇస్తామన్నారు. ఈ టెక్నాలజీ ద్వారా వార్తల సేకరణ, ఎడిటింగ్ మరియు వేగవంతంగా వార్తలను ప్రజలకు అందించడంలో జర్నలిస్టుల నైపుణ్యాలను మెరుగుపరుస్తామని పేర్కొన్నారు.
జర్నలిస్టుల హక్కుల పరిరక్షణతో పాటు, వారి వృత్తి నైపుణ్యాలను పెంపొందించడమే టి యు డబ్ల్యు జె ప్రధాన ధ్యేయమని వీరహత్ అలీ స్పష్టం చేశారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియా జర్నలిస్టులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రజినీకాంత్, కార్యదర్శి రాజేష్, కోశాధికారి వెంకటేష్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షుడు అబిద్, శ్రీకాంత్, శివ తదితరులున్నారు.