శ్రీ కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు

09-09-2026 | 04:13pm

ఘనంగా నిర్వహించిన బోధన్ ఆర్డీఓ కార్యాలయ సిబ్బంది

బోధన్ సెప్టెంబర్ 09 ( విజయ క్రాంతి): బోధన్ ఆర్డీఓ కార్యాలయం(RDO Office)లో బుధవారం ఉదయం ప్రముఖ తెలంగాణ కవి, ప్రజాకవి శ్రీ కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ ఎం. విజయ కుమారి కాళోజీ నారాయణరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

తెలంగాణ సమాజంలో కాళోజీ నారాయణరావు పోషించిన పాత్రను ఈ సందర్భంగా సిబ్బంది స్మరించుకున్నారు. ప్రజల సమస్యలను తన రచనల ద్వారా సమాజం దృష్టికి తీసుకువచ్చిన కాళోజీని తెలంగాణ ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడిన ప్రజాకవిగా కొనియాడారు. ఆయన రచనలు, ఉద్యమ స్ఫూర్తి నేటి తరానికి కూడా మార్గదర్శకంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.

కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని ఆయన ఆశయాలు, ప్రజాస్వామ్య విలువలు, సామాజిక చైతన్యం వంటి అంశాలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆర్డీఓ విజయ కుమారి అన్నారు. సమాజంలో ప్రజల పట్ల బాధ్యత, సేవాభావం పెంపొందించుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కార్యాలయ సిబ్బంది, ఈఓ, డిప్యూటీ తహసీల్దార్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ తదితరులు పాల్గొని కాళోజీ నారాయణరావుకు ఘనంగా నివాళులర్పించారు.

మరిన్ని వార్తలు