జాతీయ మెగా లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలి
జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్
భూపాలపల్లి టౌన్,(విజయక్రాంతి): ఈనెల 12న నిర్వహించనున్న జాతీయ మెగా లోక్ అదాలత్(National Mega Lok Adalat)ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్(SP Sirisetti Sankeerth) సూచించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రాజీ పడదగిన క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదాలు, ఆస్తి విభజన, కుటుంబపరమైన వివాదాలు, వైవాహిక సంబంధిత కేసులు, బ్యాంకు రికవరీ, విద్యుత్ చౌర్యం, చెక్ బౌన్స్, డ్రంక్ అండ్ డ్రైవ్, పెట్టి కేసులు తదితర కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చని తెలిపారు.
“రాజీ మార్గమే రాజ మార్గం” అని పేర్కొంటూ చిన్నచిన్న కేసుల విషయంలో కక్షలు పెంచుకుని సమయం, డబ్బును వృథా చేసుకోవద్దని సూచించారు. రాజీ పడదగిన కేసులను గుర్తించి, ఇరువర్గాల కక్షిదారులను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించి, రాజీ ద్వారా కేసుల పరిష్కారానికి కృషి చేయాలని పోలీస్ అధికారులకు, కోర్టు విధులు నిర్వహించే సిబ్బందికి ఎస్పీ సూచించారు. లోక్ అదాలత్ ద్వారా కేసులు త్వరితగతిన పరిష్కారమై బాధితులకు సత్వర న్యాయం లభిస్తుందని ఎస్పీ తెలిపారు.