కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై బీఆర్ఎస్ నిరసన
వాంకిడి, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) వెయ్యి రోజుల పాలనలో రైతులను విస్మరించిందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ మాజీ జడ్పీటీసీ, బీఆర్ఎస్ వాంకిడి మండల అధ్యక్షుడు పారుపల్లి అజయ్కుమార్ ఆధ్వర్యంలో గురువారం వాంకిడి మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
రైతులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అజయ్ కుమార్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయినా రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపలేదని విమర్శించారు.
ముఖ్యంగా యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రైతు సంక్షేమ పథకాల అమలులో లోపాలను సరిచేయాలని, సాగునీటి విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వీడి రైతులకు అవసరమైన నీటి వసతి కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. 22-ఏ పేరుతో ప్రజల భూములు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.
రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు వ్యవసాయ రంగానికి తగిన ప్రాధాన్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సింగిల్విండో చైర్మన్ జాబోరే పెంటు, వాంకిడి సర్పంచ్ సతీష్, డాబా సర్పంచ్ జంగు, మాజీ సర్పంచ్లు తుకారాం, జంగు, రాజయ్య, భీమ్రావు, యువజన అధ్యక్షుడు రాకేష్కుమార్, మాజీ ఎంపీటీసీలు రాజ్కుమార్, ప్రవీణ్, నాయకులు రాము పటేల్, బబ్లూ, ఇర్షాద్, అశుతోష్, అంకిత్ తదితరులు, రైతులు పాల్గొన్నారు.






