ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
ఘనంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి వేడుకలు
ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం
కోయిలకొండ, సెప్టెంబర్ 5: సర్వేపల్లి రాధాకృష్ణన్(Sarvepalli Radhakrishnan) జయంతిని పురస్కరించుకొని కోయిలకొండ మండలంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాల(Government school)ల్లో విధులు నిర్వహిస్తూ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీడీవో ధనుంజయ గౌడ్ మాట్లాడుతూ.. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. విద్యార్థులను మంచి పౌరులుగా, భావితరాలకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దే ఉపాధ్యాయ వృత్తి ఎంతో గౌరవప్రదమైనదని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు తమ బాధ్యతలను అంకితభావంతో నిర్వర్తిస్తూ విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేయాలని సూచించారు.
అంతకుముందు సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఎంఈఓ కార్యాలయం ఎదుట ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ మినహాజుద్దీన్, మండల పీఆర్టీయూ అధ్యక్షుడు గోపాల్ నాయక్, ఉపాధ్యాయులు మొగులయ్య, ఎంఆర్సీ శంకర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.






