కాళోజీ జీవితం, ఆయన చూపిన మార్గం ఆదర్శప్రాయం : కలెక్టర్ రాహుల్ శర్మ

09-09-2026 | 09:45pm

ఘనంగా కాళోజీ 112వ జయంతి వేడుకలు

భూపాలపల్లి టౌన్,(విజయక్రాంతి): ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు జీవితం, ఆయన చూపిన మార్గం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. కాళోజీ 112వ జయంతి సందర్భంగా మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కాళోజీ తన కవిత్వం, రచనలు, ఉద్యమ స్ఫూర్తితో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారని తెలిపారు. తెలంగాణ ప్రజల జీవన విధానం, భాష, యాస, సంస్కృతి, ప్రజల ఆకాంక్షలను తన సాహిత్యంలో ప్రతిబింబించిన గొప్ప ప్రజాకవి అని కొనియాడారు. సామాజిక అసమానతలు, అన్యాయాలపై ప్రశ్నిస్తూ ప్రజల పక్షాన నిలిచిన కాళోజీ సాహిత్యం నేటికి స్ఫూర్తిదాయకమన్నారు.

తెలంగాణ భాష, యాస, నుడికారానికి కాళోజీ చేసిన సేవలను గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆయన జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాళోజీ ఆశయాల సాధనకు కృషి చేయడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, డీఆర్ఒ వసంత కుమారి, బీసీ సంక్షేమ అధికారి ఇందిర, ఇతర శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు