పోలీస్ ఉద్యోగ అభ్యర్థులకు శారీరక, రాత పరీక్షల నిర్వహణ
అర్హత సాధించిన అభ్యర్థులకు 70 రోజుల ఉచిత శిక్షణ
భూపాలపల్లి టౌన్, సెప్టెంబర్ 06 ( విజయక్రాంతి ): పోలీస్ ఉద్యోగ అభ్యర్థుల ఉచిత శిక్షణ శిబిరం కోసం జయశంకర్ భూపాలపల్లి(Jayashankar Bhupalpally) జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆదివారం రోజున జిల్లా పోలీస్ కార్యాలయంలో అధికారులు శారీరక పరీక్షలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 350 మంది అభ్యర్థులు9Candidates) పరీక్షలకు హాజరయ్యారు. అనంతరం సింగరేణి పాఠశాలలో రాత పరీక్షలు నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ సింగరేణి పాఠశాలలో ఏర్పాటు చేసిన రాత పరీక్షా కేంద్రాన్ని పరిశీలించారు. పరీక్షా కేంద్రంలోని ఏర్పాట్లను పరిశీలించి, పరీక్షలు రాస్తున్న అభ్యర్థులతో మాట్లాడి వారి సన్నద్ధతను, పరీక్షకు సంబంధించిన అంశాలను అడిగి తెలుసుకున్నారు. అభ్యర్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి, తమకు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
జిల్లా అదనపు ఎస్పీ నరేష్ కుమార్ మాట్లాడుతూ.. శారీరక, రాత పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఉచిత డే స్కాలర్ క్లాసులతో పాటు గ్రౌండ్ కోచింగ్ను 70 రోజుల పాటు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి టౌన్ సీఐ శ్రీనివాస్, ఆర్ఐలు రత్నం, సంతోష్ కుమార్, కాశీరాం, ఆర్ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు






