స్పీకర్కు బీఆర్ఎస్ బహిరంగ క్షమాపణ చెప్పాలి
కామారెడ్డి, సెప్టెంబర్ 8(విజయక్రాంతి): అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యేలు స్పీకర్ పట్ల ప్రవర్తించిన తీరు అత్యంత హేయమైనదని, ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని కాంగ్రెస్ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు గడ్డమీది మహేష్ మండిపడ్డారు. బుధవారం కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పదేళ్ల పాటు అధికారంలో ఉండి అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించిన బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్నారు. శాసనసభ అంటే దేవాలయం లాంటిదని, అలాంటి సభకు పెద్ద అయిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పట్ల బీఆర్ఎస్ నేతలు అమానుషంగా, దురుసుగా మాట్లాడటాన్ని సేవాదళ్ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
ఇది కేవలం స్పీకర్ ను అవమానించడం కాదు, తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలను, రాజ్యాంగాన్ని అవమానించడమే అని అన్నారు. వెంటనే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పీకర్ కు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే సేవాదళ్ సహించబోదని, బీఆర్ఎస్ క్షమాపణ చెప్పకపోతే రాష్ట్ర సేవాదళ్ అధిష్టానం నిర్ణయం మేరకు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు, భవిష్యత్ ప్రణాళిక ప్రకటిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిసిసి జనరల్ సెక్రెటరీ నిమ్మ విజయ్ కుమార్ రెడ్డి,కామారెడ్డి నియోజకవర్గం కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు మెహర్ బాబా గౌడ్, కామారెడ్డి సేవాదళ్ టౌన్ అధ్యక్షులు, సుదర్శన్, రాజంపేట మండల సేవాదళ్ అధ్యక్షులు వేణు చారి పాల్గొన్నారు.