ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సర్పంచ్, ఉప సర్పంచ్ ఆకస్మిక తనిఖీ
మణుగూరు,(విజయక్రాంతి): ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయా, ఆసుపత్రిలో రోగులకు అందుతున్న సౌకర్యాలు ఎలా ఉన్నాయి, అనే అంశాలను తెలుసుకునేందుకు సమితిసింగారం గ్రామపంచాయతీ, సర్పంచ్ కలబోయిన మాధవరావు, ఉప సర్పంచ్ గాండ్ల సురేష్, మణుగూరు వంద పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి(Manuguru 100-bed government area hospital)ని శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వివిధ వార్డుల్లో విస్తృతంగా పర్యటించి రోగులను పరామర్శించారు. వారికి అందుతున్న వైద్యం, వైద్య సిబ్బంది అందుబాటు, ఆసుపత్రిలోని సౌకర్యాలపై రోగులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఫార్మసీలోని మందుల నిల్వలను పరిశీలించారు. అదేవిధంగా ఆసుపత్రి ముందు భాగంలో సుమారు రూ.50 లక్షల వ్యయంతో నిర్మాణంలో ఉన్న ఓపీ బ్లాక్ పనులను పరిశీలించి, పనుల పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్, ఉప సర్పంచ్ మాట్లాడుతూ... పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు(Pinapaka MLA Payam Venkateshwarlu) ప్రజా ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని తెలిపారు.
ఏజెన్సీ ప్రాంత ప్రజలకు మెరుగైన, నాణ్యమైన, అధునాతన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కృషి చేస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్యే చొరవతో ఆసుపత్రికి లక్షల రూపాయల విలువైన ఆధునిక వైద్య పరికరాలు సమకూరాయని, తద్వారా స్థానికంగానే ప్రజలకు మెరుగైన వైద్యం అందే అవకాశం ఏర్పడిందన్నారు. రోగులకు అంకితభావంతో సేవలందిస్తున్న వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందిని వారు అభినందించారు.






