పట్టణాల నుంచి పల్లెలకు మేలైన రహదారుల: మంత్రి సీతక్క
రూ.15.87 కోట్లతో హ్యామ్ రోడ్లకు శంకుస్థాపన
మంత్రి జూపల్లితో కలిసి రహదారుల శిలాఫలకాన్ని ప్రారంభించిన సీతక్క
నాగర్కర్నూల్/పెద్దకొత్తపల్లి, సెప్టెంబర్ 5(విజయక్రాంతి): ప్రజా రవాణా కోసం పల్లెల నుంచి పట్టణాలకు మేలైన, సౌకర్యవంతమైన రహదారుల నిర్మాణమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి అనసూయ సీతక్క(Seethakka) అన్నారు. శనివారం నాగర్కర్నూల్(Nagarkurnool) జిల్లా పర్యటనలో భాగంగా ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao)తో కలిసి కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో రూ.15.87 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న మూడు హ్యామ్ రహదారి పనులకు నక్కలబండ స్టేజ్ వద్ద ఎంపీ మల్లు రవి, జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్తో కలిసి శంకుస్థాపన చేశారు.
పెద్దకొత్తపల్లి మండలం బండారపాకుల నుంచి నక్కలపల్లి, వెంకటచెర్ల మీదుగా జెడ్పీ రోడ్డు(ZP Road) వరకు 6.95 కి.మీ. రహదారిని రూ.5.69 కోట్లతో, బండపల్లి మీదుగా పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి జమ్మనాపూర్ వరకు 4.40 కి.మీ. రహదారిని రూ.3.60 కోట్లతో నిర్మించనున్నారు. అలాగే వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలంలో కొర్లకుంట ఎక్స్ రోడ్డు నుంచి తూముకుంట–బొల్లారం ఎక్స్ రోడ్డు వరకు 8 కి.మీ. రహదారిని రూ.6.56 కోట్లతో చేపట్టనున్నారు.
మూడు రహదారుల మొత్తం పొడవు 19.35 కి.మీ. కాగా, మొత్తం అంచనా వ్యయం రూ.1,586.70 లక్షలు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్సింగ్ జీ. పాటిల్, అదనపు కలెక్టర్ దేవసహాయం, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.






