అమరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని అభివృద్ధి దిశగా అడుగులు
నాగర్ కర్నూల్, ఆగస్టు 15 (విజయక్రాంతి): స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి పిలుపునిచ్చారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, డా. బీఆర్ అంబేడ్కర్, మౌలానా అబుల్ కలాం ఆజాద్, సుభాష్ చంద్రబోస్, భగత్సింగ్ తదితరుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్య్రం లభించిందన్నారు. వారి ఆశయాలను కొనసాగిస్తూ సామాజిక న్యాయం, సమానత్వం, ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీలను అమలు చేస్తూ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా జిల్లాలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు తెలిపారు. సన్నబియ్యం పంపిణీ, కొత్త రేషన్ కార్డుల మంజూరు, స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ వంటి కార్యక్రమాలతో కందనూల్ జిల్లా మొట్ట మొదటి స్థానంలో నిలిచిందన్నారు.
15-08-2026