అంతర్ రాష్ట్ర దొంగల అరెస్ట్
- పోలీసుల అదుపులో రాజస్థాన్ వాసులు
- ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌక్ ప్రాంతంలో సిగరెట్ షాప్(Cigarette shop)లో చోరీకి పాల్పడిన రాజస్థాన్కు చెందిన నలుగురు అంతర్ రాష్ట్ర దొంగలను పట్టుకున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు. శనివారం ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్(Adilabad One Town Police Station)లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దొంగతనం(Theft) వివరాలను వెల్లడించారు. నిందితులు ముందుగా షాప్ వద్ద రెక్కీ నిర్వహించి, రాత్రి సమయంలో గడ్డపారతో షాప్ తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించి వివిధ రకాల సిగరెట్ బాక్సులతో పాటు కౌంటర్లోని నగదును చోరీ చేశారు.
వీటిని హైదరాబాద్లోని పఠాన్చెరులో తమకు పరిచయమైన వ్యక్తికి కొంత మొత్తానికి సిగరెట్ బాక్సులను విక్రయించి నగదును నలుగురు పంచుకున్నారు. మిగిలిన సిగరెట్ బాక్సులను విక్రయించేందుకు, మరో చోరీకి పాల్పడే ఉద్దేశంతో నిందితులు తిరిగి ఆదిలాబాద్కు వచ్చారు. ఆదిలాబాద్(Adilabad)లో సిగరెట్ బాక్సులను విక్రయిస్తున్న సమయంలో పోలీసులు వారిని గుర్తించి పట్టుకునేందుకు ప్రయత్నించగా, పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా సిగరెట్ షాప్లో చోరీ చేసినట్లు అంగీకరించారు. సిగరెట్ల మొత్తం విలువ సుమారు రూ. 5.35 లక్షలు ఉంటుంది.
నిందితులు కుమావత్ బుందారం, కుమావత్ ఘనశ్యామ్, కుమావత్ మాణిక్ చంద్, కుమావత్ లక్ష్మణ్ లు పోలీసులకు వెల్లడించారని ఎస్పీ తెలిపారు. పై నలుగురితో పాటు హైదరాబాద్ కు చెందిన తేజ్పాల్ సింగ్ పై కేసులు నమోదు చేశామన్నారు. వీరి నుంచి సిగరెట్ సెట్స్ తో పాటు రూ. 60 వేల నగదు, కారు, నాలుగు సెల్ ఫోన్లుమ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. విచారణలో నిందితులు గతంలో మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్, హైదరాబాద్ హైవే పక్కన ఉన్న పాన్ డబ్బాను పగులగొట్టి నగదు చోరీ చేసినట్లు వెల్లడించారని తెలిపారు. వీరిపై ఏడు అంతర్ రాష్ట్ర కేసులు ఉన్నాయని, దొంగలించిన సొత్తులో దాదాపు 80 శాతం రికవరీ జరిగిందని తెలిపారు.






