గంజాయి మొక్కలు స్వాధీనం
వాంకిడి, (విజయక్రాంతి): మండలంలోని సోనాపూర్ గ్రామ శివారులో అక్రమంగా సాగు చేస్తున్న 32 గంజాయి మొక్కల(Cannabis plants)ను వాంకిడి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోనాపూర్ గ్రామానికి చెందిన సెడాం రాజు (40)ను అరెస్టు చేసి జుడీషియల్ రిమాండ్కు తరలించినట్లు వాంకిడి ఎస్సై తెలిపారు.
ఎస్సై డి. మహేందర్కి అందిన ముందస్తు సమాచారంతో నిందితుడి వ్యవసాయ భూమిలో తనిఖీలు నిర్వహించగా గంజాయి మొక్కలు గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు. పత్తి, కంది పంటలతో పాటు గంజాయిని సాగు చేస్తున్నట్లు విచారణలో నిందితుడు వెల్లడించినట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న గంజాయి మొక్కల విలువ సుమారు రూ.3.20 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
గంజాయి సాగు, విక్రయాలు, వినియోగానికి పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని వాంకిడి సీఐ ఎస్. వెంకటగోపాల్ హెచ్చరించారు. గంజాయికి సంబంధించిన సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈ దాడిలో ఎస్సైతో పాటు పోలీసు సిబ్బంది, రెవెన్యూ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.