కల్తీ కాటుకు 11 మంది బలి
- 24 మందికి చికిత్స, కొందరి పరిస్థితి విషమం
- మధ్యప్రదేశ్ సాగర్ జిల్లాలో కలకలం రేపిన కల్తీమద్యం ఘటన
- సీఎం మోహన్యాదవ్ సీరియస్, విచారణకు ఆదేశం
- ఐదుగురు ఎక్సైజ్ అధికారులు, పోలీసులు సస్పెండ్
- ఉత్తరప్రదేశ్ నుంచి సరఫరా అయినట్లు గుర్తింపు
- నెట్వర్క్ను ఛేదించే పనిలో పోలీసులు
- ప్రభుత్వ వైఫల్యంపై కాంగ్రెస్ రాస్తారోకో
భోపాల్, సెప్టెంబర్ 6: మధ్యప్రదేశ్లో కల్తీమద్యం(Adulterated Liquor) కాటుకు 11 మంది మృతి చెందగా, 24 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై సీఎం మోహన్ యాదవ్(CM Mohan Yadav) అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలను సహించబోమన్నారు. ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశిస్తూ దోషులు ఎంతటివారైనా వదలిపెట్టొద్దని ఆదివారం అధికారులను ఆదేశించారు.
మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లా కేంద్రానికి 30 కి.మీ. దూరంలో ఉన్న బందా తహశీల్ నౌరాజ్, గూగ్రా ఖుర్ద్ అనే గ్రామాలలో శనివారం రాత్రి నుంచి అర్థరాత్రి వరకు పలువురు గ్రామస్తులు మద్యం సేవించారు. కాసేపటికే వాంతులు, తలనొప్పి, జ్వరం వంటి లక్షణాలతో కళ్లు తిరిగి కింద పడిపోయారు. విషయం తెలుసుకొని హుటాహుటీన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని బాధితులను సమీపంలోని ఆరోగ్య కేంద్రాలకు, బుందేల్ఖండ్ మెడికల్ కాలేజీకి చికిత్స నిమిత్తం తరలించారు.






