పిల్లలకు పిలుపు
విజయక్రాంతి నెట్వర్క్, జూన్ 6: బడిబాట మొదలైంది. తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియ గురువారం అడుగు పడింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బడిబాట కార్యక్రమం లాంఛనంగా ప్రారంభమైంది. పలు జిల్లాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు కార్యక్రమాన్ని ఆరంభించారు. సర్కారు స్కూళ్లలో గల సౌలత్లను వివరించారు. బడీడు పిల్లలు కచ్చితంగా పాఠశాలల్లో ఉండాలని సూచించారు. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యను పెంచేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
మెరుగైన విద్యను అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, సర్కారు కల్పిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని వక్తలు పిలుపునిచ్చారు. మొదటి రోజు అవగాహన ర్యాలీలు నిర్వహించారు. పలు చోట్ల కలెక్టర్లు పిల్లలకు స్కూల్ యూనిఫామ్స్ అందజేశారు. కామారెడ్డి జిల్లాలో 1,101 పాఠశాలల్లో బడిబాట నిర్వహించగా, కామారెడ్డి డీఈవో రాజు సమీక్ష చేపట్టారు. ఎంఈవోలకు పలు సూచనలు చేశారు. నిజాంసాగర్ మండలంలో ఉపాధ్యాయులు ప్రతిజ్ఞ చేశారు.
ఆదిలాబాద్ జిల్లాలో తాంసీ మండలంలోని జెడ్పీ హైస్కూల్లో బడిబాట సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా స్కూల్ డ్రెస్లు పంపిణీ చేశారు. అమ్మ ఆదర్శ కమిటీ చేపట్టిన పనులను పర్యవేక్షించారు. పనులను త్వరగా పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని అభ్యుదయ పాఠశాలలో బడిబాట ర్యాలీని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ప్రారంభించి, ప్రభుత్వ విద్యపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని క్యాచ్మెంట్ ఏరియాలోని విద్యార్థుల ఇళ్లను సందర్శించి, పలువురిని ఆరో తరగతిలో చేర్పించారు. అంతకుముందు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. నిర్మల్ జిల్లా రూరల్మండలంలోని అక్కాపూర్ గ్రామం లో నిర్వహించిన బడిబాటలో కలెక్టర్ ఆశీశ్ సంగ్వాన్ పాల్గొన్నారు. అనంతరం నిర్మల్, ఖానాపూర్, మథోల్లోని పాఠశాలలను సందర్శించి, విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్స్ అందజేశారు. పెద్దపల్లి జిల్లా పెద్దబొంకుర్ ప్రభుత్వ పాఠశాలలో జరిగిన బడిబాట కార్యక్రమంలో కలెక్టర్ ముజామ్మిల్ఖాన్ పాల్గొని ప్రభుత్వం అందిస్తున్న విద్యా వసతులను వినియోగించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సర్కారు కల్పిస్తున్న సౌకర్యాలను వివరించారు.
గద్వాలలో ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్రెడ్డి, విజేయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి.. బడిబాట నిర్వహణపై కలెక్టర్ సంతోశ్తో మాట్లాడారు. స్కూల్ పూర్తిస్థాయిలో ప్రారంభమయ్యేనాటికి అన్ని వసతులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. మంచిర్యాల జిల్లాలో డీఈవో యాద య్య ముఖ్యఅతిథిగా బడిబాటను ప్రారంభించారు. బడీడు పిల్లలను గుర్తించి, నిరుపేదలకు సర్కారు విద్యను దగ్గరకు చేర్చేలా కృషి చేస్తామని వెల్లడించారు. విద్యార్థులు, ఉపాధ్యా యులచే ప్రతిజ్ఞ చేయించారు.






