తుంగతుర్తిలో కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం
దళిత నాయకులను అవమానిస్తే, సహించేది లేదు
పిఎసిఎస్ చైర్మన్ గుడిపాటి సైదులు
తుంగతుర్తి (విజయ క్రాంతి): తుంగతుర్తి మండల(Thungathurthy Mandal) కేంద్రంలోని మెయిన్ రోడ్డుపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్(Assembly Speaker Gaddam Prasad) పై, బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిలు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా, బుధవారం మండల ఎస్సీ సెల్ కాంగ్రెస్ నాయకులు(Congress leaders) కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీలను భర్తరఫ్ చేయాలని పీఏసీఎస్ చైర్మన్ గుడిపాటి సైదులు డిమాండ్ చేశారు. దళితుల ఓట్లను అడిగే హక్కు బీఆర్ఎస్ పార్టీకి లేదన్నారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు చేసిన అవమానకర వ్యాఖ్యలు ఉపసంహరించుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. అదే విధంగా కేసీఆర్ ఫామ్ హౌస్ లో దళిత కాంగ్రెస్ నాయకులు నిరసన చేయగా, పసుపు నీళ్లతో శుద్ధి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, వారికి దళితుల పట్ల చిత్తశుద్ధి లేదని విమర్శించారు.