రేవంత్ రాజీనామా చేయాలి
- ఆరు గ్యారంటీలతో మోసం
- ఫీజురీయింబర్స్మెంట్ ఎక్కడ?
- జీవో 97ను రద్దు చేయాలి
- ఫీజుల బకాయిలపై అసెంబ్లీలో గల్లా పట్టుకుని అడుగుతా
- మాజీ మంత్రి హరీశ్రావు
- సిద్దిపేటలో నిరుద్యోగ యువత, విద్యార్థులతో నిరసన
సిద్దిపేట, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో పూర్తిగా విఫలమైందని, ప్రజలను మోసం చేసిన సీఎం రేవంత్రెడ్డి నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు (Former Minister and Siddipet MLA Harish Rao) డిమాండ్ చేశారు. శనివారం సిద్దిపేట అంబేద్కర్ చౌరస్తాలో నిరుద్యోగ యువత, విద్యార్థుల నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఫీజు బకాయి లతో విద్యార్థుల చదువులు మధ్యలోనే ఆగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఏటా వేల కోట్ల రూపాయలను ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఖర్చు చేశామని, ఇంజినీర్లు, డాక్టర్లు, ఫార్మసిస్టులు, న్యా యవాదులుగా ఎదగడానికి పేద విద్యార్థులకు అవకాశం కల్పించామని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజుల విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతోందని విమర్శించారు.
కాలేజీలు ఫీజులు రాక అధ్యాపకులకు జీతాలు చెల్లించలేని పరిస్థితికి చేరా యని, విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వలేని దుస్థితి ఏర్పడిందన్నారు. విద్యార్థుల కోసం ఎంత దూరమైనా పోరాడతామని, అవసరమైతే కాంగ్రెస్ నేతలను గల్లా పట్టుకుని అడిగే స్థాయిలో పోరాటం చేస్తామన్నారు. పాలిటెక్నిక్ విద్యను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేసే నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. జీవో 97నురద్దు చేయాలని డిమాండ్ చేశా రు.
పాలిటెక్నిక్ చదివి ఇంజినీర్లు కావాలనుకునే విద్యార్థులను కేవలం బ్లూ కాలర్ ఉద్యో గాలకే పరిమితం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడొద్దు అంటూ ప్రభుత్వాన్ని హెచ్చ రించారు. కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా జీవోను రద్దు చేయాలన్నారు.
జాబ్లెస్ క్యాలెండర్
నిరుద్యోగ యువతకు ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాల హామీ ఏమైందని హరీశ్రావు ప్రశ్నించారు. జాబ్ క్యాలెండర్ పేరుతో అసెంబ్లీలో పెట్టిన పత్రంలో ఉద్యోగాల సంఖ్యే కనిపించలేదని విమర్శిస్తూ, జాబ్ క్యాలెండర్ కాస్తా జాబ్లెస్ క్యాలెండర్ అయిపోయిందని ఎద్దేవా చేశారు. రెండు లక్షల ఉద్యోగాల హామీ ఇచ్చి, ప్రభుత్వం అధికారికంగా పేర్కొన్న సంఖ్యతో పోలిస్తే చాలా తక్కువ ఉద్యోగాలకే పరిమితమైందని ఆరోపించారు. సిద్దిపేటలో శిల్పారామం, రంగనాయకసాగర్ టూరిజం అభివృద్ధి పనులను నిలిపివేశారని విమర్శించారు.
దుద్దెడ వద్ద రూ.200 కోట్లతో మంజూరు చేసి పనులు ప్రారంభించిన వెటర్నరీ కళాశాలను కొడంగల్కు తరలించారని ఆరోపించారు. నిరసనల్లో పాల్గొంటున్న విద్యార్థులపై కేసులు పెట్టడం, వారిని వేధించడం మానుకోవాలని హెచ్చరించారు. ఈ నెల 7 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో జీవో 97 రద్దు, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల, నిరుద్యోగుల ఉద్యోగాలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తామని ప్రకటించారు.






