SIRతో సెలబ్రిటీలకు షాక్..ఈసీ నోటీసులు!
హైదరాబాద్: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)లో భాగంగా పలువురు టాలీవుడ్, క్రీడా, వ్యాపార రంగ ప్రముఖులకు ఎన్నికల అధికారులు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. పలువురు ప్రముఖుల పేర్ల లో వ్యత్యాసాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటిలో ఉన్న తేడాలను సరి చేయటంతో పాటుగా వారి రికార్డులతో సరిపోలక పోవటంతో వీరందరికీ ఎన్నికల సంఘం అధికారులు నోటీసులు జారీ చేశారు. వీరు వ్యక్తిగతంగా హాజరైన వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.
ఎన్నికల సంఘం దేశ వ్యాప్తంగా SIR ప్రక్రియ కొనసాగిస్తోంది. అందులో భాగంగా తెలంగాణలోనూ సమయం పొడిగించి సమర్ధవంతంగా ఈ విధానం అమలు చేస్తోంది. కాగా, హైదరాబాద్ నగరం లోని ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ప్రచురించిన ముసాయిదా ఓటర్ల జాబితా పరిశీలన అనంతరం అధికారులు పెద్ద ఎత్తున నోటీసులు జారీ చేశారు. నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్ వంటి కీలక నియోజకవర్గాల పరిధిలో ఓటరుగా నమోదైన పలువురు ప్రముఖుల వివరాల్లో సాంకేతిక లోపాలు, వ్యత్యాసాలు బయటపడటంతో ఎన్నికల అధికారులు చట్టబద్ధంగా ఈ వివరణ నోటీసులు పంపారు. వీరిలో సినీ, క్రీడా, వ్యాపార రంగాలకు చెందిన పలువురు అగ్రశ్రేణి ప్రముఖులకు ఎన్నికల సంఘం షాకిచ్చింది. ఈసీ నోటీసులు అందుకున్న వారిలో టాలీవుడ్ అగ్రశ్రేణి తారలు, దిగ్గజ దర్శకులు ఉన్నారు.
నోటీసులు పంపిన జాబితాలో రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు, ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్లతో పాటు సీనియర్ నటుడు దగ్గుబాటి వెంకటేశ్, ఆయన కుటుంబ సభ్యులు ఈ జాబితాలో ఉన్నారు. వీరితో పాటు ప్రముఖ కథానాయిక సమంత రూత్ ప్రభు, యువ హీరో విజయ్ దేవరకొండ, ఆయన సోదరుడు ఆనంద్ దేవరకొండ పేర్లు కూడా ఎన్నికల సంఘం నోటీసుల లిస్టులో చేరాయి. వీరితో పాటుగా క్రికెటర్లు వీవీఎస్ లక్ష్మణ్, మిథాలీ రాజ్, జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్, స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ కూడా ఈ జాబితాలో ఉన్నారు.
అదే విధంగా ప్రముఖ ఫార్మా దిగ్గజం దివీస్ ల్యాబ్స్ అధినేత మురళీకృష్ణ ప్రసాద్ దివి, అపోలో హాస్పిటల్స్ డైరెక్టర్ ఉపాసన కొణిదెల వంటి ప్రముఖులకు సైతం నోటీసులు జారీ అయినట్లు తెలుస్తోంది. వీరు ప్రత్యక్షంగా విచారణకు హాజరు కాలేకుంటే.. వారి తరపున ఒక ప్రతినిధిని పంపే వెసులుబాటు కల్పించింది. ఓటరు గుర్తింపు కార్డుల్లో వివరాలు మ్యాచ్ కాకపోవడంతో వీరందరికీ తమ ఆధారాలను మళ్లీ సమర్పించి సవరణలు చేసుకోవాలని సూచించారు.