చెంచు కుటుంబాల పునరావాసానికి రూ.4.50 కోట్లతో అభివృద్ధి పనులు
పెద్దకొత్తపల్లి: నల్లమల టైగర్ రిజర్వ్(Nallamala Tiger Reserve) పరిధిలోని మూడు గ్రామాలకు చెందిన 257 చెంచు కుటుంబాల పునరావాసం కోసం పెద్దకొత్తపల్లి మండలం బాచారం గ్రామంలో ఆర్అండ్ఆర్ కాలనీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. రాష్ట్ర మంత్రులు దనసరి అనసూయ సీతక్క, జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao), నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి, జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ కలిసి పనులను ప్రారంభించారు.
రూ.4.50 కోట్ల అంచనా వ్యయంతో కాలనీలో సీసీ రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ తదితర మౌలిక వసతులను అభివృద్ధి చేయనున్నారు. చెంచు కుటుంబాలకు సురక్షితమైన, గౌరవప్రదమైన జీవన పరిస్థితులు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పునరావాస చర్యలు చేపడుతోందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ అధికారి రేవంత్ చంద్ర, ఎఫ్డీఓ చంద్రప్రకాశ్, అదనపు కలెక్టర్ దేవసహాయం, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, చెంచు కుటుంబాల సభ్యులు పాల్గొన్నారు.






