ప్రజా పాలన దినోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు
మట్టి వినాయకులతో పర్యావరణ పరిరక్షణకు సహకరించాలి
జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
గద్వాల : సెప్టెంబర్ 17న నిర్వహించనున్న ప్రజా పాలన దినోత్సవాన్ని(Praja Palana Dinotsavam) ఘనంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్(Collector Rizwan Basha Shaik) అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఎస్పీ శ్రీనివాసరావు(SP Srinivasa Rao)తో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించి ఏర్పాట్లపై సమీక్షించారు.
అన్ని సౌకర్యాలు సిద్ధం చేయాలి
ప్రోటోకాల్ ప్రకారం అతిథులకు ఆహ్వానాలు, జాతీయ పతాకావిష్కరణకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించే కార్యక్రమానికి టెంట్లు, బారికేడ్లు, వేదిక, తాగునీరు, విద్యుత్, ఫైర్ సేఫ్టీ, వైద్య శిబిరం, పారిశుధ్య ఏర్పాట్లు చేయాలన్నారు. శాంతిభద్రతలకు పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని, సెప్టెంబర్ 17 ప్రాధాన్యతను ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. పురపాలక సంఘాలు, మండలాల్లోనూ ప్రజా పాలన దినోత్సవాన్ని నిర్వహించాలని ఆదేశించారు.
మట్టి వినాయకులనే పూజించాలి
ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలను పూజించి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని కలెక్టర్ కోరారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలతో కాలుష్యం పెరిగే అవకాశం ఉన్నందున పర్యావరణహితంగా గణేష్ ఉత్సవాలను నిర్వహించాలని సూచించారు. అధికారులు సైతం మట్టి గణనాథులను పూజించి ప్రజలకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మట్టి వినాయకుల ప్రాధాన్యతపై రూపొందించిన గోడపత్రికలను, మట్టి విగ్రహాలను కలెక్టర్ ఎస్పీ, ఇతర అధికారులతో కలిసి ఆవిష్కరించారు. అధికారులకు, కలెక్టరేట్ సిబ్బందికి మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు మధుమోహన్, నర్సింగరావు, ఆర్డీవో శ్రీనివాసరావు, కలెక్టరేట్ ఏవో మంజుల, జిల్లా అధికారులు పాల్గొన్నారు.