బోయిన్పల్లి సెంటర్ పాయింట్లోని మహావీర్ టిఫిన్స్లో.. సాంబార్లో జెల్లపురుగులు
కస్టమర్ అవాక్కు..
- మామూళ్ల మత్తులో ఫుడ్ సేఫ్టీ అధికారులు
- కంటోన్మెంట్ బోర్డ్ పరిధిలో పుట్టుకొస్తున్న కల్తీ హోటళ్లు
- మహావీర్ టిఫిన్ ఘటనతో బయటపడ్డ అధికారుల నిర్లక్ష్యం
- నెలవారీ మామూళ్లే కారణమంటున్న జనం
- ప్యూర్ వెజ్ హోటల్లో సాంబార్లో జెల్లపురుగులు
- కస్టమర్ ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు
సికింద్రాబాద్, సెప్టెంబర్ 7 (విజయక్రాంతి): మనం ఏమి తింటున్నాం.. పిల్లలకు ఏమి పెడుతున్నాం అనే విషయం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి.సికింద్రాబాద్ సెంటర్ పాయింట్ లోని ప్రముఖ ప్యూర్ వెజ్ హోటల్ మహావీర్ టిఫిన్ అండ్ మీల్స్ లో ఆహార భద్రత ప్రశ్నార్థకంగా మారింది.హోటల్ లో ఒక కస్టమర్ కు సర్వ్ చేసిన సాంబార్ లో జలపురుగులు ప్రత్యక్షమయ్యాయి. టిఫిన్ తింటుండగా సాంబార్ లో చిన్న చిన్న పురుగులు కదులుతుండటం గమనించిన కస్టమర్ అవాక్కయ్యాడు.
వెంటనే హోటల్ సిబ్బందికి విషయాన్ని తెలియ జేసి వీడియో తీశాడు.ప్యూర్ వెజ్ పేరుతో నడుస్తున్న హోటల్ లో ఇలాంటి ఘటన జరగడం పట్ల కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వంటశాలలో పరిశుభ్రత పాటించకపోవడం వల్లే ఇలా జరిగిందని కస్టమర్ ఆరోపిస్తున్నారు.
ఈ ఘటనపై ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు బాధిత కస్టమర్ తెలిపారు. ఇలాంటి హోటళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కంటోన్మెంట్ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉండి తగు చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇలాంటి కల్తీలు పుట్టుకోస్తున్నాయి.
మామూళ్ల మత్తులో ఫుడ్ సేఫ్టీ అధికారులు.. పుట్టుకొస్తున్న కల్తీ హోటళ్లు..
సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తీరు అనుమానాలకు తావిస్తోంది. సెంటర్ పాయింట్ లోని మహావీర్ టిఫిన్ అండ్ మీల్స్ ప్యూర్ వెజ్ హోటల్లో సాం బార్లో జలపురుగులు రావడం ఒక్కటే కాదు, ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతున్నా అధికారులు చర్యలు తీసు కోకపోవడం వెనుక మామూళ్ల మత్తు ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కంటోన్మెంట్ పరిధిలో వందలాది హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, కర్రే, బిర్యాని పాయింట్లు, స్వీట్ షాపులు బేకరీలు నడుస్తున్నాయి. వీటిలో ఎక్కడా ఫుడ్ లైసెన్స్ లేదు, పరిశుభ్రత లేదు. వంటశాలలు అపరిశుభ్రంగా ఉన్నా, కల్తీ నూనెలు, నిల్వ ఉంచిన కూరగాయలు వాడుతున్నా అధికారులు కళ్లు మూసుకుంటున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి నెలా హోటళ్ల నుండి మామూళ్లు తీసుకుంటూ తనిఖీల పేరుతో తూతూ మంత్రంగా వ్యవహ రిస్తున్నారని, అందుకే హోటల్ యజమానులకు అధికారుల అండతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని స్థానిక ప్రజలు చెబుతున్నారు.ఒక పక్క ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతుంటే,
ఫుడ్ సేఫ్టీ అధికారులు మాత్రం ఏసీ గదులకే పరిమి తమయ్యారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని కంటోన్మెంట్ లోని అన్ని హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టి, కల్తీకి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
కంటోన్మెంట్ ఫుడ్ సేఫ్టీ అధికారి వివరణ..
హోటల్ పై ఫిర్యాదు రాగానే కంటోన్మెంట్ అధికారి ఆశిష్ చౌహాన్ మహా వీర హోటల్లో తనిఖీ నిర్వహించి, లోపాలను గుర్తించి నట్టు తెలియజేస్తూ సంబంధిత పై అధికారులకు నివేదిక అందజేసిన తదుపరి చర్యలు తీసుకున్నామని చౌహాన్ తెలియజేశారు.
హోటల్ యజమాని వివరణ..
మేము 30 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నాం. ఏప్పుడు ఎలాం టి కంప్లైంట్ తప్పు మా ద్వారా జరగలేదు. జలపురుగు వచ్చినది వాస్తవమే, ఎలా జరిగిందని మాకు తెలియదు. మా తప్పయితే లేదు, దీనిపై కంటోన్మెంట్ అధికారులు కూడా వచ్చి చెక్ చేశారు. మా తప్పుంటే చర్యలు తీసుకోవచ్చు.
ఈ ఘటనలో గుమ్మత్తయిన విషయం ఏమిటంటే..
స్థానికంగా కొందరు మధ్యవర్తులు హోటల్ యజమానితో కస్టమర్ బంధువుల పేరుతో రూ.20 వేలు తీసుకుని సెటిల్మెంట్ చేసుకున్న సంఘటన అందర్నీ ఆశ్చర్య గురిచేసింది..
