ఐలమ్మ స్ఫూర్తి ప్రజలకు ఆదర్శం
మున్సిపల్ చైర్పర్సన్ రొంటాల సుహాసిని
హుజురాబాద్, సెప్టెంబర్ 10: (విజయక్రాంతి): వీరనారి చిట్యాల ఐలమ్మ స్ఫూర్తి ప్రజలకు ఆదర్శంగా నిలిచిందని హుజురాబాద్ మున్సిపల్ చైర్పర్సన్(Huzurabad Municipal Chairperson) రొంటాల సుహాసిని కొనియాడారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో రజక యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నిమ్మటూరి సాయి కృష్ణ అధ్యక్షతన వీరనారి చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్పర్సన్ రొంటాల సుహాసిని, పట్టణ సీఐ కరుణాకర్ హాజరై రజక సంఘం పట్టణ అధ్యక్షుడు కొండపాక శ్రీనివాస్ తో కలిసి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భూమి కోసం.. భుక్తి కోసం.. వెట్టిచాకిరీ విముక్తి కోసం పోరాడిన ఘనత వీరనారి చాకలి ఐలమ్మకే దక్కుతుందని అన్నారు. తెలంగాణ ప్రజల(People of Telangana) తెగువను ప్రపంచానికి చాటిన నిప్పుకణికగా చాకలి ఐలమ్మ చరిత్రలో నిలిచిపోయారని కొనియాడారు. అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె ప్రదర్శించిన ధైర్యం, పోరాట పటిమ, త్యాగం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
ఐలమ్మ పోరాటం చరిత్రలో చిరస్థానం
దొరల పెత్తనం, వెట్టిచాకిరీ, సామాజిక వివక్షకు వ్యతిరేకంగా ఐలమ్మ(Chakali Ilamma) సాగించిన పోరాటం తెలంగాణ రైతాంగ పోరాటానికి స్ఫూర్తినిచ్చిందని తెలిపారు. సాధారణ కుటుంబంలో జన్మించిన ఐలమ్మ అన్యాయాన్ని ఎదిరించి, తన హక్కుల కోసం వెనుకడుగు వేయకుండా పోరాడిన ధీరవనిత అని గుర్తుచేశారు. ఐలమ్మ చూపిన తెగువ వల్ల అణగారిన ప్రజల్లో హక్కుల కోసం పోరాడాలనే చైతన్యం పెరిగిందని అన్నారు. ఆమె జీవిత చరిత్రను నేటి యువత తెలుసుకొని, సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఐలమ్మ ఆశయాలను కొనసాగించడమే ఆమెకు ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావడానికి ఐలమ్మ వంటి వీరనారుల పోరాట చరిత్ర స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కోయాల్కర్ భారతి, సొల్లు సునీత, వెంకన్న, రజక సంఘం ప్రధాన కార్యదర్శి కొలిపాక శ్రీనివాస్, కొలిపాక సారయ్య, నల్ల బాలరాజు, కొలిపాక శంకర్, సుంకరి రాజమౌళి, కొలిపాక పోచయ్య, కొలిపాక శ్రీనివాస్, కొలిపాక రవి, ప్రజా సంఘాల నాయకులు, జనార్ధన్, తాళ్లపల్లి శ్రీనివాస్, తాళ్లపల్లి రమేష్, వేల్పుల ప్రభాకర్, రత్నం, కొలిపాక సమ్మయ్య, సొల్లు బాబు, చిలకమర్రి శ్రీనివాస్, కొండపాక పవన్ కుమార్, కే క్రాంతి కుమార్, కొలిపాక రంగయ్య, సైదాపూర్ మాజీ ఎంపీపీ వెంకట్రాజం, నాయకులు, యువజన సంఘం ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు, విద్యావంతులు, మహిళలు, వివిధ వర్గాల ప్రజలు పాల్గొని ఐలమ్మకు ఘనంగా నివాళులర్పించారు.