వడ్లను మిలింగ్ చేయకుండా విక్రయం
భద్రకాళి మాడ్రన్ రైస్మిల్ యాజమాన్యంపై కేసు.. నలుగురు అరెస్ట్
చేగుంట,(విజయక్రాంతి): మెదక్ బోనాల కొండాపూర్ గ్రామ శివారులోని భద్రకాళి మాడ్రన్ రైస్మిల్(Bhadrakali Madron Rice Mill) యాజమాన్యం ప్రభుత్వానికి సంబంధించిన వడ్లను మిలింగ్ చేయకుండా విక్రయించినట్లు ఆరోపణలపై కేసు నమోదైంది. తెలంగాణ స్టేట్ సివిల్ సప్లై కార్పొరేషన్ లిమిటెడ్(Telangana State Civil Supply Corporation Limited) ఆధ్వర్యంలో 2024–25 ఖరీఫ్, రబీ సీజన్లకు మిల్లింగ్ కోసం కేటాయించిన వడ్లలో 1,267.452 మెట్రిక్ టన్నుల వడ్లను మిలింగ్ చేయకుండా విక్రయించినట్లు, వాటి విలువ సుమారు రూ.3.72 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు.
ఈ మేరకు మెదక్ జిల్లా(Medak District) సివిల్ సప్లై కార్పొరేషన్ మేనేజర్ జగదీష్కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా భద్రకాళి రైస్మిల్ యాజమాన్యానికి చెందిన రంగమ్మ శ్రీకాంత్రెడ్డి, రంగమ్మ ఉపేందర్రెడ్డి, రంగమ్మ వేణుగోపాల్రెడ్డి, కారింగుల చంద్రశేఖర్రెడ్డిలను రామాయంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ బి. సైదా ఆధ్వర్యంలో పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.