చంద్రు తండా వద్ద అగ్నికీలల్లో రెండు లారీలు.. భయానక రోడ్డు ప్రమాదం
నలుగురు ఉన్నట్లు సమాచారం.. సహాయక చర్యల్లో అగ్నిమాపక సిబ్బంది
తిరుమలాయపాలెం,(విజయక్రాంతి): తిరుమలాయపాలెం మండల పరిధిలోని చంద్రు తండ సమీపంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొనడంతో భారీగా మంటలు చెలరేగి వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాదం జరిగిన క్షణాల్లోనే మంటలు వేగంగా వ్యాపించి రెండు లారీలు పూర్తిగా దగ్ధమవుతున్న దృశ్యాలు స్థానికులను భయాందోళనకు గురి చేశాయి. స్థానికుల సమాచారం మేరకు లారీలలో మొత్తం నలుగురు వ్యక్తులు ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే వారి పరిస్థితిపై ఇంకా అధికారిక సమాచారం వెలువడలేదు. ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఫైర్ ఇంజన్తో సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రమాద తీవ్రత అధికంగా ఉండటంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ట్రాఫిక్ను నియంత్రిస్తూ సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై ఎస్సై కూచిపూడి జగదీష్ దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






