రెవిన్యూ సేవలను వేగవంతంగా నిర్వహించాలి
23-07-2025
జిల్లాలో రెవిన్యూ సేవలను వేగవంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్(District Collector B.M. Santosh) అధికారులను ఆదేశించారు. బుధవారం ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాల్ నందు భూ-భారతి, రేషన్ కార్డుల ధృవీకరణ, మీ - సేవ దరఖాస్తులు, ఎఫ్-లైన్ పిటిషన్లపై అన్ని మండలాల తహసీల్దార్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజలకు అవసరమైన రెవిన్యూ సేవలు ఆలస్యం కాకుండా నిబద్ధతతో చేయాలని అన్నారు. భూమి సమస్యలను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో చూస్తోందని, రెవిన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను త్వరగా పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అన్ని దరఖాస్తులు పూర్తిగా వంద శాతం ఆన్ లైన్ నమోదు చేయాలని అన్నారు. మీసేవ ద్వారా 2022 సంవత్సరం వరకు దరఖాస్తు చేసిన వివిధ సర్టిఫికెట్లు పెండింగ్లో ఉంచకుండా, ఒక వారం లోపల పరిష్కరించాలని అన్నారు.