ఏజెన్సీ హక్కులు కల్పించాలి
22-01-2026
జైనూర్, (విజయక్రాంతి):ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులతో పాటు తాతలు–ముత్తాతల కాలం నుంచి నివసిస్తున్న ఏజెన్సీ దళితులకు ప్రభుత్వ పరంగా పథకాలు, హక్కులు కల్పించాలని, రైతులకు పట్టాలు, పహాణీలు మంజూరు చేయాలని కోరుతూ గురువారం మండలంలోని జంగాం గ్రామంలో జరిగిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఏజెన్సీ షెడ్యూల్డ్ కులాల జేఏసీ జిల్లా నాయకులు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా జేఏసీ జిల్లా నాయకులు కాంబ్లే బాబాసాహెబ్, మావలే దత్త మాంగ్, కాంబ్లే అన్నారావు, ఘాటే రామారావులు మాట్లాడుతూ ఏజెన్సీ ఎస్సీల సమస్యలను ప్రభుత్వం ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. అదేవిధంగా తలసేమియా, సికిల్ సెల్ జిల్లా కోఆర్డినేటర్ ఆడ వెంకటేష్తో పాటు పలువురు నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉప ముఖ్యమంత్రికి వినతి పత్రాలు అందజేశారు.