బెజ్జుర్ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ నితికా పంత్
బెజ్జూర్,విజయక్రాంతి: బెజ్జూర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ను వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ నితికా పంత్, ఐపీఎస్ మంగళవారం తనిఖీ చేశారు. ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన ఎస్పీ, పోలీస్ సిబ్బంది పరేడ్ను పరిశీలించారు. అనంతరం స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు.తదుపరి పోలీస్ స్టేషన్లోని వివిధ విభాగాలు, రికార్డులు, కార్యాలయ నిర్వహణను పరిశీలించారు. స్టేషన్ను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని, రికార్డులను సక్రమంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన గ్రేవ్ కేసులు, పెండింగ్ కేసులు, దర్యాప్తులో ఉన్న కేసుల పురోగతి, సీడీ ఫైళ్లు, రౌడీ షీట్లు, సస్పెక్ట్ షీట్లు, బైండోవర్ కేసుల వివరాలను ఎస్సై సార్తజ్ పాషాను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసులను త్వరగా పూర్తి చేసి, నాణ్యమైన దర్యాప్తు ద్వారా బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
12-08-2026