ధాన్యం సేకరణ ప్రక్రియలో వేసవి దృష్ట్యా రక్షణ చర్యలు
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయ క్రాంతి): ప్రస్తుతం కొనసాగుతున్న తీవ్ర వడగాలులు, ఉష్ణోగ్రతల దృష్ట్యా వరి ధాన్యం సేకరణ ప్రక్రియలో భాగంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులు, సేకరణ పనులను నిర్వహించే సిబ్బంది రక్షించడానికి నిర్దిష్ట చర్యలను తప్పక అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కె.హరిత ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, ఖమ్మం, మంచిర్యాల, గద్వాల్, నారాయణపేట, వనపర్తి, నాగర్కర్నూల్ వంటి జిల్లాలలో ఎండ తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం అత్యవసర హెచ్చరికను జారీ చేసిందని తెలిపారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు నీడ కల్పించేందుకు తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేయాలని, టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉండేలా చూడాలని, రైతులు, హమాలీలకు వడదెబ్బ తగలకుండా నివారించడానికి చల్లటి తాగునీరు, మజ్జిగ, ఓ.ఆర్.ఎస్. అందించే "చలివేంద్రాలను" ఏర్పాటు చేయాలని తెలిపారు.
16-04-2026