గంజాయి స్వాదీనం
పెబ్బేరు: వనపర్తి జిల్లా పెబ్బేరు పోలీస్ స్టేషన్ పరిధిలో(Pebbair Police Station Limits) గంజాయి అక్రమ రవాణా, విక్రయాలకు సంబంధించి పోలీసులు కీలక విజయాన్ని సాధించారు. గురువారం ఉదయం అందిన సమాచారంతో చేపట్టిన ఆపరేషన్లో కొంత మందిని అరెస్ట్ చేసి, గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాలలో.. ఉదయం 10 గంటల సమయంలో బాలాజీ ధాబా సమీపంలో ఇద్దరు వ్యక్తులు గంజాయి అమ్మకానికి వస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు వెంటనే పై అధికారులకు తెలియజేశారు. అనంతరం తహసీల్దార్ సత్యనారాయణ రెడ్డి సమక్షంలో ప్రభుత్వ పంచులతో పాటు క్లూస్ టీం సహాయంతో అక్కడికి చేరుకున్నారు. సుమారు 11 గంటల సమయంలో అనుమానితులు అక్కడికి రాగానే వారిని అదుపులోకి తీసుకుని విచారించగా, వారి పేర్లు ప్రవీణ్ కుమార్, బబ్లు కుమార్ సింగ్ అని, ఇద్దరూ బీహార్ రాష్ట్రానికి చెందినవారని వెల్లడైంది. వీరు ఇటీవల బాలాజీ రైస్ మిల్లో పని చేస్తూ గంజాయి విక్రయాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. వారి వద్ద నుంచి నాలుగు ప్యాకెట్లు (మొత్తం 16 గ్రాములు) గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
10-04-2026