మహిళల ఆర్థిక సాధికారతకు సమాఖ్య సంఘాలు కీలకం
19-02-2026
చిట్యాల, ఫిబ్రవరి 19(విజయ క్రాంతి): మహిళల ఆర్థిక సాధికారతకు మహిళా సమాఖ్య సంఘాలు కీలకమని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. గురువారం నకిరేకల్ మండలంలోని గోరెంకలపల్లి, మార్రూర్ గ్రామాల్లో నూతనంగా నిర్మించనున్న మహిళా సమాఖ్య సంఘం భవనాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి ఆయన శిలాఫలకాలను ఆవిష్కరించి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళల ఆర్థిక సాధికారతకు మహిళా సమాఖ్య సంఘాలు కీలకమని, గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు సమావేశాలు, శిక్షణా కార్యక్రమాలు నిర్వహించేందుకు సొంత భవనాలు అవసరమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభివృద్ధి, స్వయం ఉపాధి అవకాశాల పెంపు దిశగా కట్టుబడి ఉందని పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధికి అవసరమైన ప్రతి పనికి తన వంతు కృషి చేస్తానని, మహిళల సంక్షేమం కోసం మరిన్ని కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళా సంఘ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.