మట్టి పరీక్ష పంటల అభివృద్ధికి తొలి అడుగు
19-02-2026
కల్వకుర్తి: వ్యవసాయ రంగంలో రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచడం ద్వారా అధిక దిగుబడులు సాధించడంతో పాటు రైతులకు మెరుగైన లాభాలు అందుతాయని,ఈ లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండరామిరెడ్డి అన్నారు. గురువారం రైతు కమిషన్ బృందం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం వంగూర్ మండలంలోని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామమైన కొండారెడ్డిపల్లి గ్రామంలో రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరామిరెడ్డి నేతృత్వంలో కలెక్టర్ బాదావత్ సంతోష్, అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ వంశీకృష్ణ పాల్గొని గ్రామంలోని రైతు వేదిక వద్ద రైతులకు భూసార పరీక్షల ప్రాముఖ్యత, నేల నాణ్యత ఆధారంగా ఎరువుల వినియోగ విధానం, సేంద్రియ వ్యవసాయం ప్రయోజనాలపై వివరణాత్మకంగా అవగాహన కల్పించారు. అనంతరం మినీ కిట్ల పంపిణీ, భూసార పరీక్షలకు సంబంధించిన పరికరాలను రైతులకు పంపిణీ చేశారు.