దైవ దర్శనం పేరిట కాసుల దందా..!
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): నాగర్కర్నూల్ జిల్లా కుమ్మెర గట్టుపై జరుగుతున్న మల్లన్న జాతరలో దైవ దర్శనం పేరుతో కాసుల దందా సాగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జాతరకు వచ్చే భక్తుల నుంచి, అక్కడ తాత్కాలికంగా దుకాణాలు ఏర్పాటు చేసుకున్న చిరు వ్యాపారుల నుంచి భారీగా వసూళ్లు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దారాలు, బుంగలు అమ్ముకునే వారితో పాటు సోడా లెమన్ పాణ్యం అమ్ముకునే వారి వద్ద కూడా వేలల్లో డబ్బులు దండుకుంటున్నారని విమర్శలున్నాయి. భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించకపోయినా దర్శనం, పార్కింగ్, షాపుల ఏర్పాట్ల పేరుతో నిర్వాహకులు డబ్బులు వసూలు చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగునీరు, మరుగుదొడ్లు, భద్రత వంటి ప్రాథమిక సదుపాయాలు లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మల్లన్న గట్టు పైకి ఎక్కేందుకు భక్తులకు సరిపడా దారి కూడా ఏర్పాటు చేయకపోయినా దాని పేరుతో మాత్రం అడ్డగోలుగా దోచుకుంటున్నారని భక్తులు మండిపడుతున్నారు.
24-02-2026