2 July, 2026 | 5:17 PM

Districts - Peddapalli

article_35674535.webp
విద్యుత్ షాక్‌తో గేదె మృతి.. రైతుకు రూ.70 వేల నష్టం

ముత్తారం, జూలై 02(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలోని జిల్లాలపల్లి గ్రామపంచాయతీ సమీపంలో గురువారం విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు చొప్పరి నారాయణకు చెందిన గౌడ్ గేదె విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. వ్యవసాయ భూమి సమీపంలో ఉన్న విద్యుత్ స్తంభం వద్ద ప్రమాదవశాత్తు విద్యుత్ ప్రవాహం తగలడంతో గేదె ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో రైతుకు సుమారు రూ.70 వేల మేర ఆర్థిక నష్టం వాటిల్లింది. సంఘటన విషయం తెలుసుకున్న గ్రామస్థులు అక్కడికి చేరుకుని రైతును ఓదార్చారు. విద్యుత్ శాఖ అధికారులు ఘటనపై విచారణ జరిపి, నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

02-07-2026

article_88077676.webp
కాళేశ్వరం వైఫల్యాలపై హరీశ్ రావు సమాధానం చెప్పాలి: ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణ రావు

కరీంనగర్, పెద్దపల్లి జూలై 2(విజయ క్రాంతి) కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలు రెండేళ్లు కూడా గడవక ముందే కుంగిపోవడానికి కారణాలపై మాజీ మంత్రి హరీశ్ రావు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాధనంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కుంగిపోవడం బీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. కేసీఆర్, హరీశ్ రావు ఇంజనీర్ల సలహాలను పక్కనబెట్టి డిజైన్లలో మార్పులు చేయడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) నివేదిక ఆధారంగా ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతోందని, మరమ్మతు పనులు కూడా ప్రారంభమయ్యాయని తెలిపారు.

02-07-2026