గ్రంథాలయాల్లో పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలు
04-01-2026
మంచిర్యాల టౌన్,(విజయక్రాంతి): గ్రంథాలయంలో పాఠకులకు, ఉద్యోగార్ధులకు అవసరమైన పుస్తకాలు అందుబాటులో ఉంచడం జరుగుతుందని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కేంద్ర గ్రంథాలయాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి గ్రంథాలయంలో కల్పించిన సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ విద్యా రంగం, గ్రంథాలయాల అభివృద్ధికి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందన్నారు. గ్రంథాలయాలలో పాఠకులకు, పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు అవసరమైన పుస్తకాలు, సామాగ్రి సమకూర్చడం జరిగిందని, ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు చేపట్టి అనేక మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తుందన్నారు. గ్రంథాలయాల్లో పాఠకులకు, అభ్యర్థులకు అవసరమైన తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని, పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.