బోయినపేటను విస్మరిస్తున్న విద్యుత్ అధికారులు
మంథని, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): మంథని మున్సిపాలిటీ 6వ వార్డు పరిధిలోని బోయినపేటలో విద్యుత్ సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదని కౌన్సిలర్ పోతరవేని శ్రీలతక్రాంతి మండిపడ్డారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు లేక రాత్రివేళ ప్రజలు చీకట్లో రాకపోకలు సాగిస్తున్నారని, కొన్ని చోట్ల విరిగిన, శిథిలావస్థకు చేరిన స్తంభాలు ప్రమాదకరంగా మారాయని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అడ్డుగా ఉన్న స్తంభాలు, తీగలను తొలగించి కొత్తగా అవసరమైన చోట స్తంభాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బోయినపేట ప్రధాన రహదారికి వీధి దీపాలు ఏర్పాటు చేయాలని కోరారు. అధికారులు వెంటనే స్పందించకుంటే ప్రజలతో కలిసి విద్యుత్ కార్యాలయం ముట్టడి చేసి, అవసరమైతే నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు.
04-09-2026 | 01:22pm