మదర్ థెరిసా పొదుపు సమితిపై ఆరోపణల కలకలం
మంథని, ఆగస్టు 28 (విజయక్రాంతి): మహిళల ఆర్థిక స్వావలంబన, పొదుపు లక్ష్యంగా ఏర్పాటైన మదర్ థెరిసా మహిళా పొదుపు సమితిపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సభ్యుల పొదుపు సొమ్ము, రుణాల పంపిణీ, వడ్డీ వసూళ్లు, ఖాతాల నిర్వహణలో పారదర్శకత లేదంటూ కొందరు సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలికితీయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మంథని పట్టణంలోని లైన్గడ్డ సమీపంలో కొనసాగుతున్న ఈ సమితి 2002 నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ఫిర్యాదుదారులు పేర్కొంటున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సభ్యుల నుంచి ఎంత పొదుపు సొమ్ము సేకరించారు, ఎంత మొత్తాన్ని రుణాలుగా అందించారు, ఎంత వడ్డీ వసూలు చేశారు, ప్రస్తుతం సమితి వద్ద ఎంత నిధి ఉందనే అంశాలపై పూర్తి వివరాలు వెల్లడించాలని వారు కోరుతున్నారు.
28-08-2026