మాడిపోయిన అన్నం, నీళ్ల సాంబారు తినలేకపోతున్నాం.. విద్యార్థుల ఆవేదన
మల్కాజిగిరి, ఆగస్టు 21,(విజయక్రాంతి): నేరేడ్ మెట్ మండల ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడ సరైన భోజనం పెట్టక పోవడంతో సగం మంది విద్యార్థులు ఇంటి బాట పట్టిన పట్టించుకునే వారు లేరు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం అమలు చేస్తూ, పాఠశాలల బలోపేతానికి ఒక వైపు కృషి చేస్తూ ఉంటే, మరోవైపు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్ల విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్నం భోజనం అందక పస్తులు ఉండే పరిస్థితి ఏర్పడింది. కొంత మంది విద్యార్థులు ఇంటి నుండి భోజనాలను టిఫిన్ బాక్సులలో తెచ్చుకుని భోజనాలు చేస్తున్నామని వాపోతు న్నారు. ఈ పాఠశాలలో మాడిపోయిన అన్నం, నీళ్ల సాంబారు అంద జేస్తున్నారని ఇది తినాలంటే మాకు ఇబ్బందిగా ఉందని పిల్లలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
21-08-2026