చందాపూర్ లో క్రీడా మైదానానికి ఏర్పాటుచేసిన బోర్డు

20-09-2026 | 06:28pm
  1. బోర్డులకే పరిమితం.....
  2. ఆచరణ శూన్యం...
  3. పట్టించుకోని అధికారులు....

తాడ్వాయి,సెప్టెంబర్, 20( విజయ క్రాంతి): గ్రామీణ ప్రాంతాల్లోని (Rural areas) క్రీడలపై ఆసక్తి ఉన్న యువకులకు, విద్యార్థులకు ప్రత్యేక ఆట స్థలాలు ఏర్పాటు చేస్తే యువకులు, విద్యార్థులు క్రీడలలో మరింత నైపుణ్యం సాధించి క్రీడలలో రాణిస్తారనే లక్ష్యంతో అప్పటి ప్రభుత్వం ప్రతి గ్రామంలో క్రీడామైదానాలను ఏర్పాటు చేసింది.ఈ మైదానాల ఏర్పాటుకు ప్రత్యేక స్థలాలు గుర్తించి అక్కడ మైదానాలుగా తీర్చిదిద్దాలని సంకల్పించింది. కానీ కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలో ఏర్పాటు చేసిన క్రీడా మైదానాలు అబాసు పాలవుతున్నాయి.

క్రీడా మైదానాలకు ఏర్పాటుచేసిన బోర్డులు మాత్రమే కనబడుతున్నాయి. బోర్డుల వెనుక అసలు ఇది మైదానమేనా అన్నట్లుగా ఆశ్చర్యమేస్తుంది. క్రీడా మైదానంలో చదును లేకుండా పోయింది. మైదానంలో పిచ్చిముక్కలే దర్శనమిస్తున్నాయి. 

చందాపూర్ లో పిచ్చి మొక్కలతో దర్శనం....

తాడువాయి మండలంలోని చందాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన క్రీడా మైదానం పిచ్చి మొక్కలతో నిండి ఉంది. మైదానంలో పిచ్చి మొక్కలే దర్శనమిస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగా క్రీడామైదానాలు మైదానాలుగా రూపుదిద్దుకోలేదు. ఎక్కడబడితే అక్కడ క్రీడామైదానులకు బోర్డులు ఏర్పాటు చేసి ఇవే క్రీడా మైదానాలు అన్నట్లుగా చిత్రీకరించారు.ఒక్క చందాపూర్ గ్రామంలోనే కాకుండా మండలంలోని తాడువాయి, ఎర్ర పహాడ్, నందివాడ, కృష్ణాజివాడి,చిట్యాల గ్రామాలతోపాటు జిల్లాలోని చాలా మండలాలలోని గ్రామాలలో సైతం క్రీడా మైదానాలు క్రీడలు ఆడుకోవడానికి అనువుగా లేవు. 

ఒక్కో మైదానానికి రూ.3 నుంచి 4 లక్షల ఖర్చు..

క్రీడా మైదానాల ఏర్పాటుకు ఒక్కో మైదానానికి రూ. 3 నుంచి రూ.4 లక్షల నిధులు ఖర్చు చేశారు.ప్రభుత్వ ఒత్తిడి ఉంది కదా అని క్రీడా మైదానాలను ఎలాగైనా పూర్తి చేయాలనే ఉద్దేశంతో మాత్రమే క్రీడా మైదానాలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. నేలను చదును చేయకుండానే, మైదానాలకు అవసరమైన ఏర్పాట్లు చేయకుండానే సదరు కాంట్రాక్టర్లు క్రీడా మైదానాల ఏర్పాటుతో డబ్బులు పొందారనే విమర్శలు ఉన్నాయి. అధికారులు సైతం మైదానాలు ఎలా నిర్మించారు,ఎలా ఉన్నాయి అనేవి పరిశీలించకుండానే బిల్లులు పూర్తి చేశారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి క్రీడా మైదానాలలో స్థలాన్ని చదును చేసి యువకులకు, విద్యార్థులకు ఆడుకునే ఆట స్థలాలుగా మార్చాలని ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు