అప్రకటిత విద్యుత్ కోతలపై రైతుల ధర్నా
పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన
వనపర్తి మండలం, సెప్టెంబర్ 12(విజయక్రాంతి): అప్రకటిత విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని ఆరోపిస్తూ వనపర్తి మండలం నాచహల్లి, కృష్ణగిరి, పెద్దగూడెం తండా, సవాయిగూడెం గ్రామాలకు చెందిన రైతులు(Farmers) శనివారం సబ్స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. వనపర్తి–పెబ్బేరు ప్రధాన రహదారిపై బైఠాయించి విద్యుత్ శాఖకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
సమాచారం అందుకున్న ఏఈ చంద్రశేఖర్ అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అయితే డీఈతో మాట్లాడించాలని రైతులు పట్టుబట్టడంతో ఏఈ ఫోన్ ద్వారా డీఈతో మాట్లాడించారు. ప్రభుత్వం ప్రకటించిన 13 గంటల వ్యవసాయ విద్యుత్ సరఫరా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంటలు ఎండిపోకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో పలువురు రైతులు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.