కరీంనగర్లో గంజాయి దందా గుట్టురట్టు
కారులో 8.19 కిలోల గంజాయి స్వాధీనం – ఒకరు అరెస్ట్
కరీంనగర్ క్రైం, సెప్టెంబర్ 12(విజయ క్రాంతి): కరీంనగర్ నగరంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా(Drug trafficking), విక్రయాలపై పోలీసులు కొనసాగిస్తున్న ప్రత్యేక నిఘాలో భాగంగా కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు, టాస్క్ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో 8.19 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. కరీంనగర్ పట్టణంలోని లక్ష్మీనగర్, అమీర్ షాహీ మసీద్ సమీపంలో గంజాయిని అక్రమంగా నిల్వ చేసి విక్రయిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు అప్రమత్తమై, నిఘా ఏర్పాటు చేసి అనుమానాస్పద కదలికలపై దృష్టి సారించారు.
ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం అమీర్ షాహీ మసీద్ సమీపంలో అనుమానాస్పదంగా ఉన్న మొహమ్మద్ రిజ్వానుద్దీన్ @ ఫైజాన్ (26) ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అతని ఆధీనంలోని కారు నంబర్ ఏపి09 బిఎస్ 5815ను తనిఖీ చేయగా, కారు డిక్కీలో బ్యాగుల్లో ప్యాక్ చేసి ఉంచిన గంజాయి గుర్తించారు. నిబంధనల ప్రకారం తనిఖీ నిర్వహించి మొత్తం 8.190 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా గంజాయి తరలింపునకు ఉపయోగించినట్లు గుర్తించిన కారు, ప్యాకింగ్ సామగ్రి మరియు ఒక మొబైల్ ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసును సమర్థవంతంగా ఛేదించడంలో కరీంనగర్ వన్ టౌన్ , టాస్క్ఫోర్స్ సిబ్బంది సమన్వయంతో పనిచేశారని కరీంనగర్ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ రాంచందర్ రావు తెలిపారు.