29-04-2025 12:00:00 AM
ఆదిలాబాద్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): ఆదిలాబాద్లో కరువైన పచ్చదనం, కనుమరుగైన ఆహ్లాదంపై మున్సిపల్ అధికారులు స్పందించారు. ‘విజయక్రాంతి’ దిన పత్రికలో సోమవారం ‘ఎండిన చెట్లు... పండిపోయిన గడ్డి’... శీర్షికతో ప్రచురితమైన కథనానికి మున్సిపల్ అధికారులు స్పందించారు. పచ్చదనం కరువై.. కళావిహీనంగా దర్శనమిస్తున్న చౌరస్తాలు, రోడ్ల మధ్యలో ఉన్న డివైడర్లను పరిరక్షించడంలో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కథనం రావడంతో అధికారుల్లో చలనం వచ్చింది.
ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలోని పలు చౌరస్తాల్లో, అదేవిధంగా రోడ్ల మధ్యలో ఉన్న డివైడర్లలో ఎండిపోయిన చెట్లు పండిపోయిన గడ్డిని సోమవారం మున్సిపల్ సిబ్బంది తొలగించారు. పచ్చదనాన్ని పెంపొందించేందుకు మొక్కలకు, గడ్డికి నీరు పోశారు. కళావిహీనంగా మారిన చౌరస్తాలు, డివైడర్లలలో పచ్చదనం పెంచి, ఆహ్లాదకర వాతావరణం పెంపొందించేందుకు చర్యలు ప్రారంభించడంతో పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.