బీసీలకు బడ్జెట్లో తీవ్ర అన్యాయం
బీసీ డిక్లరేషన్ను విస్మరించిన ప్రభుత్వం
మాజీ జిల్లాపరిషత్ చైర్మన్ దఫెదర్ రాజు
నిజాంసాగర్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీసీ వర్గాలకు వార్షిక బడ్జెట్ కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం జరిగిందని మాజీ జడ్పీ చైర్మన్ దాఫెదర్ రాజు ఆరోపించారు. శనివారం మహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని బీ ఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఒక వైపు 42 శాతం రాజకీయ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని, మరో వైపు బడ్జెట్ కేటాయింపుల్లోనూ బీసీలను పూర్తిగా విస్మరించడం దురదృష్టకరమని పేర్కొన్నారు. , ప్రభుత్వం ప్రకటించిన బీసీ డిక్లరేషన్ను కూడా అమలు చేయకుండా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ప్రస్తుత బడ్జెట్ను “సంక్షేమ బడ్జెట్ కాదు.. కమిషన్ల బడ్జెట్”గా ఆయన ఎద్దేవా చేశారు. బీసీల అభివృద్ధికి సరైన ప్రాధాన్యం ఇవ్వకపోవడం ప్రభుత్వ వైఖరిని స్పష్టంగా చూపుతోందని అన్నారు. సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు సత్యనారాయణ, నాయకులు వాజిద్ అలీ, చందర్, లక్ష్మీనారాయణ, మహేందర్, అఫ్జల్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.




